ఖతార్ దేశ మాజీ పాలకుడు, ప్రస్తుత అమీర్ తండ్రి అయిన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్-థానీ (74) ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపంగా భారత ప్రభుత్వం రేపు (జులై 13, సోమవారం) ఒక రోజు జాతీయ సంతాప దినంగా ప్రకటించిందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. ఈ మేరకు నేడు దేశవ్యాప్తంగా జాతీయ జెండాను క్రమం తప్పకుండా ఎగురవేసే అన్ని ప్రభుత్వ భవనాలపై సగం ఎత్తులోనే (హాఫ్ మాస్ట్) ఎగురవేస్తారని, అలాగే ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు నిర్వహించరని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఖతార్ మాజీ అమీర్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్-థానీ ఒక గొప్ప 'విజనరీ లీడర్' అని, ఆయన నేతృత్వంలోనే ఖతార్ దేశం అద్భుతమైన అభివృద్ధిని, శ్రేయస్సును సాధించిందని ప్రధాని కొనియాడారు. "ఆయనను భారతదేశానికి ఒక నిజమైన స్నేహితుడిగా మేము భావిస్తాము. 2024 ఫిబ్రవరిలో నేను ఖతార్ పర్యటనకు వెళ్ళిన సమయంలో ఆయనను వ్యక్తిగతంగా కలుసుకునే భాగ్యం నాకు దక్కింది" అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. గల్ఫ్ దేశాలలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా పేరుగాంచిన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్-థానీ.. 1995 నుంచి 2013 వరకు ఖతార్ అమీర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆనాడు తన తండ్రిని పదవి నుంచి దించి, ఎటువంటి రక్తపాతం లేకుండా ప్యాలెస్ తిరుగుబాటు ద్వారా ఆయన అధికారంలోకి వచ్చారు. సుమారు 18 ఏళ్ల పాటు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన ఆయన, జూన్ 2013లో గల్ఫ్ రాజకీయాల్లో ఒక అరుదైన నిర్ణయం తీసుకున్నారు. తన పదవిని స్వచ్ఛందంగా వదిలేసి, తన కుమారుడైన షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీకి అధికార బాధ్యతలను అప్పగించారు. దేశంలో తదుపరి తరం నాయకత్వానికి సజావుగా బాధ్యతలు బదిలీ చేయడం కోసమే ఆయన ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారని అంతర్జాతీయ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా పలువురు అగ్రనేతలు సంతాపం ప్రకటిస్తున్నారు.మోదీ స్నేహహస్తాన్ని కాదనుకుని పెద్ద తప్పు చేశాం: పాకిస్థాన్
ఖతార్ ఆధునిక చరిత్రలో కీలక నేత..
ఖమేనీ మరణంపై భారత్ ఎందుకు సంతాపం తెలపడం లేదు?