18 ఏళ్ల సాఫ్ట్‌వేర్ కెరీర్ వదిలి.. 40 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్: జానవి అజిత్ రావు క్రేజీ జర్నీ!

వ్యక్తిగత జీవితంలో ఓ స్థిరమైన స్థానాన్ని, ఉన్నతమైన వేతనాన్ని సాధించిన అనంతరం చాలా మంది తమ అలవాటైన మార్గాన్ని విడిచిపెట్టడానికి సులభంగా ఇష్టపడరు. అయితే జీవితంలో వచ్చే కొన్ని ఊహించని మలువులు విజయవంతమైన కెరీర్‌ను కూడా వదిలేలా చేస్తాయి. సరిగ్గా ఇదే తరహాలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని దాదాపు 18 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్ రంగంలో సక్సెస్‌ఫుల్ ఇంజనీరింగ్ కెరీర్ ను కొనసాగించిన జానవి అజిత్ రావు.. 40 ఏళ్ల వయసులు వైద్య విద్య వైపు అడుగులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం జానవి సాధించిన విజయం సోషల్ మీడియాలో ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు వయస్సు కేవలం నంబర్ మాత్రమేనని.. మనిషి అనుకుంటే ఎప్పుడైనా సాధించవచ్చని ఆమె నిరూపించారు.

Advertisement

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతంలో జన్మించిన జానవి అజిత్ రావు.. అమెరికాలోని ప్రతిష్టాత్మక కాలిఫోర్నియా యూనివర్సిటీ(శాన్ డియాగో) నుంచి ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని.. ఆ తర్వాత కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచే ఎంఎస్ కూడా సాధించి ప్రముఖ సాంకేతిక సంస్థల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించారు. 2002లో ఇంజనీర్ అయిన తన భర్తతో కలిసి బెంగళూరుకు తిరిగి వచ్చిన జానవి.. ప్రముఖ కంపెనీల్లో పని చేయడమే కాకుండా డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగంలో సొంతంగా ఓ టెక్నాలజీ స్టార్టప్ సంస్థను కూడా స్థాపింంచి విజయవంతమైన మహిళా పారిశ్రామిక వేత్తగా రాణించారు.

Advertisement

జీవితాన్ని మార్చేసిన అనారోగ్య సమస్య
అయితే జానవి కెరీర్ విజయవంతంగా సాగుతున్న సమయంలో 2003లో ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. ఆమెకు 'రుమటాయిడ్ ఆర్థరైటిస్' అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. ఆ వ్యాధికి చికిత్స పొందే రోజుల్లో వైద్యుల నిబద్ధతను, రోగులకు వారు చేసిన సేవలను జానవి చాలా దగ్గరగా పరిశీలించారు. రోగుల పట్ల వైద్యులు చూపించే ఆదరణ వారి జీవితాలను మార్చే విధానం జానవిని ఎంతగానో ప్రభావితం చేశారు. ఇదే జానవి ఆలోచనలను పూర్తిగా మార్చేసి.. వైద్యురాలిగా సేవ చేయాలనే కొత్త ఆశయానికి పునాది వేసింది.

Advertisement

స్వయం సమృద్ధి కలిగిన వ్యాపారాన్ని పక్కన పెట్టి, కేవలం సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆమె 2013 లో 40వ ఏట బెంగళూరులోని ప్రముఖ ఎమ్మెస్ రామయ్య మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సులో చేరారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఓ వృత్తిలో ఉండి, తిరిగి కాలేజీ తరగతి గదిలో కూర్చోవడం ఆమెకు భారీ సవాలుగా నిలిచింది. తన వయసులో సగం ఉన్న తోటి విద్యార్థులతో పోటీపడుతూ, కఠినమైన వైద్య పాఠాలను చదవడం సాధారణ విషయం కాదు. అయినప్పటికీ ఆమె వెనకడుగు వేయకుండా.. 8 ఏళ్ల పాటు ఎంతో నిబద్ధతతో శ్రమించి చివరకు ఎంబీబీఎస్ డిగ్రీని అందుకున్నారు.

Advertisement

47 ఏళ్ల వయసులో పీజీ, ప్రాక్టీస్

ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత జానవి విజయం కేవలం ఆ పట్టాతోనే ఆగిపోలేదు. ప్రస్తుతం 47 ఏళ్ల వయసులో ఉన్న జానవి.. అమెరికాలో ప్రైమరీ కేర్ ఫిజీషియన్ గా స్థిరపడి బాధితులకు విలువైన వైద్యను అందించడంతో పాటు ఎండీ ఉన్నత విద్యను కూడు అభ్యసిస్తున్నారు. ఇటీవల వికాస్ అనే సోషల్ మీడియా యూజర్ ఎక్స్ వేదికగా జానవి అజిత్ రావు స్ఫూర్తిదాయక పయనాన్ని సవివరంగా పంచుకోగా.. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జానవి పట్టుదలకు దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సాధించాలనుకుంటే వయస్సు అనే అడ్డు కాదని.. ఎప్పుడైనా మనం అనుకున్నది సాధించవచ్చని జానవి నిరూపించిందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

English Summary

Discover the inspiring journey of Janhavi Ajit Rao, who quit her successful 18-year software engineering career to study MBBS at 40 and become a doctor in the US.