ట్రంప్ ఒత్తిడికి తలొగ్గిన ప్రధాని మోదీ.. భారతీయులపై తీవ్ర ప్రభావం: కేజ్రీవాల్

ఈ20 పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఆప్ శ్రేణులు తరలివెళ్లిన సంగతి తెలిసిందే. ఈ 20 విధానానికి వ్యతిరేకంగా 100 మంది మద్దతుదారులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి పిటిషన్లు అందించేందుకు చేపట్టిన మార్చ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు రోడ్డుపైనే వారంతా బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

" అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడితో భారత్ లో ఈ 20 పెట్రోల్ విధానాన్ని తీసుకురావొద్దు. అమెరికా నుంచి ఇథనాల్ ను కొనుగోలు చేయడం ఆపివేయండి. ప్రధాని మోదీ బలవంతంగా ప్రజలపై ప్రయోగించిన ఈ 20 పెట్రోల్ విధానంతో దేశవ్యాప్తంగా లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు దేశం సమాధానాలను కోరుతోంది. వీటికి ప్రధాని మోదీ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ 20 పెట్రోల్ అంశంపై గత నెలలోనే ప్రధాని మోదీకి లేఖలు రాశాను. కానీ ఎలాంటి స్పందన రాలేదు. దాంతో పిటిషన్ ను అందించేందుకు తాము వచ్చాము" అని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Advertisement
E20 పెట్రోల్ పై కేజ్రీవాల్ సంచలనం.. రేపు ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి..!

"మేము ఉగ్రవాదులం కాదు. ఈ 20 ఇథనాల్ సమస్యపై మేము ప్రధాని మోదీతో సమావేశం కావాలనుకుంటున్నాం. దయచేసి వారికి ఈ విషయాన్ని చేరవేయండి" అంటూ తనను అడ్డుకున్న పోలీసులను కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు పోలీసుల తీరుపై కేజ్రీవాల్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ20 నుంచి విముక్తి క‌ల‌గాలంటే వంద మంది స‌రిపోర‌ని వ్యాఖ్యానించారు. పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి రావాల‌ని పిలుపునిచ్చారు. అమెరికా నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే ప్రధాని మోదీ దేశ ప్రజలపై ఈ 20 పెట్రోల్ విధానాన్ని రుద్దుతున్నాడని మండిపడ్డారు. ఈ ఒత్తిడిని తిరస్కరించే ధైర్యం మోదీకి లేద‌న్నారు. అందుకే అమెరికా ప్రెజర్ కు త‌లొగ్గి ఈ విధానాన్ని ప్ర‌జ‌ల‌పై బ‌ల‌వంతంగా రుద్దుతున్నార‌ని కేజ్రీవాల్ కీలక ఆరోపణలు చేశారు.

Advertisement

ఇక ఆప్ దిల్లీ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ ఇదే అంశంపై మాట్లాడుతూ తాము ప్రధాని మోదీకి పిటిషన్స్ ను ఇచ్చేందుకు ఇక్కడకు వచ్చామని అన్నారు. ఈ 20 అంశంపై ఇప్పటికే చాలాసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీకి స్పష్టం చేశామని తెలిపారు. కానీ పోలీసులు తమకు అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ తరుణ్ చుగ్ ఈ క్యాంపెయిన్ అర్థం లేనిదని మండిపడ్డారు. ఈ క్యాంపెయిన్ లో లాజిక్ గానీ.. సమాచారం గానీ లేదన్నారు. రైతులకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ వ్యవహార శైలి ఉందని అన్నారు. ఇథనాల్ అంటే రైతులకు అండగా నిలబడటమేనని స్పష్టం చేశారు.