NTA నుంచి బిగ్గెస్ట్ అప్‌డేట్, NEET రీ-ఎగ్జామ్ రిజల్ట్స్ డేట్..

పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన నీట్-యూజీ (NEET-UG) పరీక్షను దేశవ్యాప్తంగా జూన్ 21న ఎన్‌టీఏ (NTA) తిరిగి నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 3న జరగాల్సిన పరీక్ష రద్దు కావడంతో దాదాపు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ రీ-ఎగ్జామ్‌కు హాజరయ్యారు. కాగా, ఈ పరీక్ష ఫలితాల విడుదలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఒక సీనియర్ అధికారి కీలక ప్రకటన చేశారు. ఈ జూలై 20వ తేదీ లోపే నీట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ఏజెన్సీ యుద్ధప్రాతిపదికన పనిచేస్తోందని తెలిపారు.

Advertisement

సాధారణంగా పరీక్ష జరిగిన 45 రోజుల్లోపు ఫలితాలను ప్రకటిస్తుంటారని, అయితే ఈసారి కేవలం 37 రోజుల్లోనే పరీక్షను నిర్వహించి, ఫలితాలను అంతకంటే చాలా ముందుగానే విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నామని ఎన్‌టీఏ అధికారి పేర్కొన్నారు. జూన్ 25న ప్రాథమిక కీ (Provisional Answer Key) విడుదల చేసి, జూన్ 28 వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువు ఇచ్చామని చెప్పారు. ఈ గడువులోగా అభ్యర్థుల నుంచి దాదాపు 10,000 అభ్యంతరాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఎన్‌టీఏ నిపుణుల బృందం ప్రతి అభ్యంతరాన్ని, దానికి సంబంధించిన ఆధారాలను నిశితంగా పరిశీలిస్తోందని.. అభ్యంతరం సరైనదిగా తేలితే అభ్యర్థి చెల్లించిన రూ.200 రుసుమును తిరిగి రీఫండ్ చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

అకడమిక్ ఇయర్ ఆలస్యం కాదు..

నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించినప్పటికీ, ఎంబీబీఎస్ (MBBS) విద్యార్థుల కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంలో ఎలాంటి ఆలస్యం జరగబోదని ఎన్‌టీఏ భరోసా ఇచ్చింది. సాధారణంగా కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియడానికి నెల రోజులకు పైగా సమయం పడుతుంది. కౌన్సెలింగ్ షెడ్యూల్‌పై ఇంకా పూర్తి స్పష్టత రానప్పటికీ, ఎంబీబీఎస్ ఫస్టియర్ తరగతులు ఎప్పటిలాగే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లోనే సకాలంలో ప్రారంభమవుతాయని అధికారి నమ్మకం వ్యక్తం చేశారు.

కౌన్సెలింగ్ ప్రక్రియ ఇలా..

ఫలితాల ప్రకటన అనంతరం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) 15 శాతం ఆల్ ఇండియా కోటా (AIQ), ఎయిమ్స్ (AIIMS), జిప్‌మర్ (JIPMER), సెంట్రల్ వర్సిటీల సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తుంది. అలాగే మిగిలిన 85 శాతం స్టేట్ కోటా సీట్ల కోసం ఆయా రాష్ట్రాలు విడిగా షెడ్యూళ్లను ప్రకటిస్తాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకుని, ఫీజు చెల్లించి, తమకు నచ్చిన కాలేజీల వెబ్ ఆప్షన్లను లాక్ చేయాల్సి ఉంటుంది. ఈసారి ఫలితాలు రాకముందే తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలు తమ అడ్మిషన్ల ముందస్తు ప్రిపరేషన్ ప్రక్రియను అప్పుడే ప్రారంభించాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఫలితాల ఖచ్చితమైన తేదీ వెలువడే అవకాశం ఉంది.

English Summary

The National Testing Agency (NTA) will declare the NEET-UG re-exam results by July 20, 2026.