ఏడు పదుల వయసులోనూ ప్రధాని నరేంద్ర మోదీ చాలా చురుకుగా, ఉత్సాహంగా కనిపిస్తారు. ఆయనలా ఉండాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. కానీ అది అందరికీ సాధ్యపడదు. తాజాగా ప్రధాని మోదీ తన దినచర్యపై కీలక విషయాలను వెల్లడించారు. తనకు కేవలం 8 సెకన్లలోనే నిద్ర పట్టేస్తుందని అన్నారు. తాను కేవలం 3 గంటలు మాత్రమే నిద్ర పోతానని స్పష్టం చేశారు. ఎన్డీయే నుంచి కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక ఇదే సమావేశంలో ఫారిన్ టూర్స్ గురించి మాట్లాడుతూ.. తాను విమానం ఎక్కగానే వెళ్తున్న దేశం కాలమానానికి తగ్గట్టుగా వాచ్ లో సమయాన్ని సర్దుబాటు చేసుకుంటానని పేర్కొన్నారు. దాంతో తాను ఏ దేశానికి వెళ్లినా ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలకు ముందు అల్పాహారం సందర్భంగా కొత్త ఎంపీలతో ప్రధాని మోదీ దాదాపు గంటపాటు సమావేశం నిర్వహించారు. వీరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కూడా ఉన్నారు.
ట్రంప్ ఒత్తిడికి తలొగ్గిన ప్రధాని మోదీ.. భారతీయులపై తీవ్ర ప్రభావం: కేజ్రీవాల్
ఈ సమావేశంలో కొత్త ఎంపీల వ్యక్తిగత ప్రవర్తన సహా రాజ్యసభలో ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించాలనే అంశాలపై వారికి ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. వీలైనంత ఎక్కువ సమయాన్ని సభకే కేటాయించాలని అన్నారు. వంద శాతం అటెండెన్స్ ను మెయింటెన్ చేయాలని సూచించారు. ఇక ఇదే సమయంలో తన వ్యక్తిగత దినచర్య గురించి తెలుసుకునేందుకు ఎంపీలు ఆసక్తి చూపారు. ఈ మేరకు ప్రధాని మోదీని దిన చర్య అడిగారు.
ఈ క్రమంలోనే ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తాను నిద్ర పోయేందుకు కళ్లు మూసుకోగానే 8 సెకన్లలోనే నిద్ర పట్టేస్తుందని తెలిపారు. అలాగే తాను కేవలం 3 గంటలు మాత్రమే నిద్ర పోతానని పేర్కొన్నారు. ఈ మేరకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జీవితంలో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే వర్తమానంలో జీవించడం ఎంతో ముఖ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ దినచర్య నేటి జెన్ జీ యువతకు దిక్సూచిగా ఉపయోగపడుతుందని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ పెడుతున్నారు.