అన్నామలై మొట్టమొదటి భారీ బహిరంగ సభ: కీలక ప్రకటనకు ఛాన్స్: విజయ్ కు సవాల్

బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు కె అన్నామలై తెరమీదికివచ్చారు. భారీ బహిరంగ సభను నిర్వహించబోతోన్నారు. కోయంబత్తూర్ జిల్లా పొల్లాచ్చి-అచ్చిపట్టి జాతీయ రహదారి సమీపంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ సభ జరుగనుంది. బీజేపీ నుంచి బయటికొచ్చిన అనంతరం అన్నామలై మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరించబోతోండటం, ఓ బహిరంగ సభను నిర్వహించబోతోండటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement

రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ధ్యేయంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అన్నామలై. ఆయన స్థాపించిన వుయ్ ద లీడర్స్ ఫోరం ద్వారా దీన్ని ఓ ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ఆయన సన్నాహాలు చేస్తోన్నారు. కొన్ని నెలలుగా తమిళనాడులో డ్రగ్స్ అంశం అధికార టీవీకే, ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ దాడులకు కారణమైంది. ఈ నేపథ్యంలో అన్నామలై తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Advertisement

రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, యువతను ఈ వ్యసనం నుంచి రక్షించేందుకు ఒక సుదీర్ఘ ప్రజా పోరాటాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఈ స అన్నామలై రాజకీయ ప్రస్థానంలో ఓ కీలక మైలురాయిగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. తమిళనాడు పశ్చిమ ప్రాంతంలో తనకు ఉన్న బలాన్ని నిరూపించుకోవడంతో పాటు మున్ముందు రాజకీయంగా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని అన్నామలై భావిస్తోన్నారు.

ఈ సభకు తరలిరానున్న జనాలను దృష్టిలో ఉంచుకుని, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఈ భారీ సభకు తరలివచ్చే వేలాది మంది ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ఫైర్ అండ్ రెస్క్యూ సేవలను సిద్ధంగా ఉంచారు. మెడికల్ ఎమర్జెన్సీ కోసం ప్రత్యేక అంబులెన్స్‌లు, పారా మెడికల్ సిబ్బందిని సభాస్థలి వద్ద అందుబాటులో ఉంచనున్నారు.

Advertisement

ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పొల్లాచ్చి ప్రధాన రహదారులపై ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, మార్గదర్శకాలను సిద్ధం చేశారు. సదస్సుకు వచ్చే సాధారణ ప్రజలకు సహకరించేలా వాలంటీర్లకు తగిన శిక్షణ ఇచ్చారు. భద్రతా పరమైన అంశాలపై స్థానిక పోలీసుల సమన్వయంతో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. ఈ సదస్సు ఎంతవరకు విజయవంతమవుతుంది, విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వంపై ఒత్తిడిని ఎంతవరకు పెంచుతుందనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.

English Summary

Pollachi Gears Up for Awareness Conference On July 11 by Annamalai Final Preparations Underway. Annamalai Anna’s Drug-Free Tamil Nadu Summit is not just another event, it’s the beginning of a people’s movement. Annamalai’s next chapter of leadership gained momentum.