ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూలై 31 రాత్రి ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో విద్యార్థులు మాట్లాడిన భాషకు సమాజం వారిని క్షమించాలంటూ వేడుకున్నారు. అయితే ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థులను క్షమించడం కాదని.. ప్రధాని మోదీనే దేశంలోని విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
" పిల్లల విషయంలో తల్లిదండ్రులు పడే బాధే అత్యంత విషాదకరం. యువతీయువకుల మృతి వెనుక వారి తల్లిదండ్రుల బాధ ఉంది. దేశంలో కుప్పకూలిన విద్య వ్యవస్థపై ఇవి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పేపర్ లీక్ లు.. పరీక్ష రద్దులు.. సంవత్సరాల ప్రిపరేషన్ ఒక్క రాత్రితో నాశనం అయింది. ఇలాంటి వ్యవస్థలో మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. విద్యార్థుల్ని క్షమించాలని ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. కానీ ఆయన ప్రాణాలు కోల్పోయిన ఏ ఒక్క విద్యార్థి పేరెంట్స్ ను అయినా ఓదార్చారా..?" అని రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించారు.
పేపర్ లీక్ కారణంగా బాధలు పడిన ఏ ఒక్క స్టూడెంట్ తోనైనా ప్రధాని మోదీ కూర్చుని మాట్లాడారా..? ప్రధాని మోదీ క్షమించడం భారతీయ విద్యార్థులకు అవసరం లేదని.. ప్రధాని మోదీనే స్వయంగా విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నీట్ పేపర్ లీక్ కారణంగా మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల తల్లిదండ్రులను రాహుల్ గాంధీ మహాబలిపురంలో కలిశారు. వారిని ఓదార్చి సంఘీభావం తెలిపారు.
మరోవైపు శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ మరో వీడియో పోస్టు చేశారు. ఆ వీడియోలో జంతర్ మంతర్ వద్ద ఏం జరిగిందో.. భారత్ తో పాటు ప్రపంచ దేశాలు చూశాయని స్పష్టం చేశారు. కొందరు యువత తనపై.. తన తల్లిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. యుక్త వయసులో ఇలాంటి తప్పులు చేయడం సహజమని వాళ్లను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తమదేనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.