చెన్నై: రాజీవ్ గాంధీ హంతకులను తమిళనాడు గవర్నర్ విడుదల చేయరని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, రాజీవ్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఏడుగురు దోషుల్ని విడుదల చేసే విషయంలో రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ప్రభుత్వం తరఫున మంత్రి డి జయకుమార్ చెప్పారు.
ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తమ కేబినెట్ ఆయనకు ఈ మేరకు ప్రతిపాదనలు అందించిందన్నారు. 27 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని, ఆమె భర్త శ్రీహరన్ అలియాస్ మురుగన్, పెరారివలన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్, శంతన్ను విడుదల చేయాలని ఇటీవల కేబినెట్ నిర్ణయం తీసుకున్నది.
ఈ విషయంపై ఈ రోజు మంత్రి జయకుమార్ మీడియాతో మాట్లాడారు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ రాష్ట్ర ప్రజల భావాలను, ఆకాంక్షలను గుర్తించి, సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీనిపై గవర్నర్ ఆలస్యం చేస్తే ప్రభుత్వం ఒత్తిడి తీసుకు వచ్చే అంశంపై స్పందించలేదు. దోషుల విడుదలపై విషయంపై త్వరగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కాబట్టే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రజల అభిలాషకు తగిన్లుగా తాము నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. తాము గవర్నర్కు ఈ విషయంపై ప్రతిపాదనలు పంపామన్నారు. తమను విడుదల చేయాలని పెరారివలన్ వేసిన పిటిషన్పై ఇటీవల విచారణ జరిపిన సుప్రీం కోర్టు, ఈ విషయంపై గవర్నర్కు ఓ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించింది.