నీట్ పేపర్ లీక్ వివాదంపై దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఇటీవల భారీ ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ ప్రాంగణం వద్ద దాదాపు నెల రోజులకు పైగా ఈ నిరసనలు జరిగాయి. ఎట్టకేలకు విద్యార్థుల ఉద్యమానికి తలొంచిన కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా ఉన్న ప్రధాన్ ను తొలగించి ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషిని కేంద్ర ప్రభుత్వం నియమించడంతో ఉద్యమం సద్దుమణిగింది.
అయితే ఈ నిరసనల్లో భాగంగా ఓ యువతి ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 23 న జంతర్ మంతర్ వద్ద రుచికా సింగ్(25) మీడియాతో మాట్లాడారు. మోదీపై అసభ్య పదజాలాన్ని వాడారు.
ఆమె వ్యాఖ్యలపై నోయిడాలో కొందరు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద ఆమెపై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ ను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. అయితే రుచికా సింగ్ పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు తప్పే.. కానీ ఆమెపై పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకోవడం సమంజసం కాదని పేర్కొంది.
ఈ మేరకు కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ సింగ్ మాట్లాడుతూ.. పోలీసులు రుచికా సింగ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయడం కరెక్ట్ కాదని అన్నారు." ఆమె వ్యాఖ్యలు ప్రధాని మోదీని కించపరిచే విధంగా ఉంటే ఆమెపై సివిల్ పరువు నష్టం లేదా క్రిమినల్ పరువు నష్టం విధించవచ్చు. కానీ ఇలా క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
యువతపై ఇలాంటి చర్యలకు పోలీసులు పాల్పడడాన్ని నేను ఏమాత్రం అంగీకరించను. అలాగే యంగ్ జనరేషన్ వాళ్లను నేనిచ్చే సలహా ఏంటంటే..? మాట్లాడే ముందు తమ భాషను జాగ్రత్తగా వాడాలి. అలాగే పోలీసులకు కూడా మేము ఇచ్చే సూచన ఏంటంటే..? పోలీసులు ఇలాంటి విషయాల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా శాంతియుతంగా వ్యవహరించాలి అని తెలిపారు.