viral video: ఏసీ కోచ్‌ లో దీపం, అగరబత్తి వెలిగించి పూజలు..!

భారతీయ రైల్వే వ్యవస్థ చాలా పటిష్టమైంది. ఇండియన్ రైల్వేస్ లో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే రైలు మార్గాన్నే అనేకమంది ఎంచుకుంటారు. అయితే ఇటీవలి కాలంలో చాలామంది ప్రయాణికులు రైలులో వింత వింత చేష్టలు చేస్తూ అటు తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగిస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో రీల్స్ కోసం చేస్తుండగా మరికొందరు మాత్రం అవగాహన లోపం కారణంగా ఇలాంటి పనులు చేస్తున్నారు. రైల్వే బోగీలోనే వంటలు చేసుకోవడం ఇటీవలి కాలంలో కామన్ అయిపోయింది. ఇలాంటి ఘటనలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజాగా దేశ రాజధాని దిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. రైలులోని ఏసీ బోగీలో ఓ ప్రయాణికుడు దీపం, అగరబత్తి వెలిగించి ఏకంగా ప్రార్థనలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తోటి ప్రయాణికులు వద్దని వారించినా వినకుండా అలాగే ప్రార్థన చేస్తూ అందరినీ ఇబ్బందికి గురి చేశాడు. ఏసీ కంపార్ట్ మెంట్ కావడంతో పొగ బయటకు వెళ్లే మార్గం లేక బోగీ మొత్తం వ్యాపించింది. దాంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఓ ప్రయాణికుడు అతనితో వాగ్వాదానికి దిగాడు. దాంతో అతడు ఆ దీపాన్ని ఆపి వేసినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇందుకు సంబంధించిన వీడియోను జార్ఖండ్‌ రైల్‌ యూజర్స్‌ అనే ఖాతా ఎక్స్‌ లో పోస్ట్‌ చేసింది. ఇలాంటి ఘటనల కారణంగా రైలులో ఫైర్ అలారం మోగే ప్రమాదం ఉందని.. అలాగే ఫైర్ యాక్సిడెంట్ జరిగే ప్రమాదం కూడా ఉందని వీడియో క్యాప్షన్ లో పేర్కొన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోటి ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి చర్యలకు పాల్పడడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఏసీ కోచ్‌ లలో ఉండే పరుపులు, కర్టెన్లు, సీట్ల కుషన్లు వంటివి సింథటిక్ పదార్థాలతో తయారు చేస్తారని.. ఇవి చాలా వేగంగా మంటలను అందుకుంటాయని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.

Advertisement

ఈ ఘటనపై రైల్వే శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఘటనలకు పాల్పడితే ప్రయాణికులు వెంటనే railmadad.indianrailways.gov.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.