తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఆయనను కొద్దిసేపటి కిందటే అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ నటి త్రిష కృష్ణన్ను ఉద్దేశించి ఆయన చేసినట్లుగా భావిస్తోన్న కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు దీనికి కారణం అయ్యాయి. కావేరీ జలాల వివాదంపై సోమవారం డీఎంకే నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న సందర్భంగా ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. దీనిపై అధికార టీవీకే ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయనిధిపై కేసు నమోదు చేశారు.
టీవీకే అటు జాతీయ మహిళా కమిషన్ ను సైతం ఆశ్రయించింది. డీఎంకేకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలకూ పిలుపునిచ్చింది. కావేరీ నదీ జలాల విడుదలలో తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దీన్ని ముఖ్యమంత్రి విజయ్ ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ డీఎంకే సోమవారం తంజావూరులో ఓ భారీ ర్యాలీ నిర్వహించింది. ఉదయనిధి స్టాలిన్ ఇందులో ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తోన్న సమయంలో కొందరు డీఎంకే కార్యకర్తలు 'త్రిష, త్రిష' అని నినాదాలు చేశారు. దీంతో ఉదయనిధి తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపివేశారు. త్రిషను ఉద్దేశించి ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.
ఈ వ్యాఖ్యలను టీవీకే తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ వ్యాఖ్యలు ఆమె ప్రతిష్ట, ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని మండిపడుతోంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడు ఇలా దిగజారి మాట్లాడటం తగదంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మహిళలను ఇలా బహిరంగంగా కించపరచడం, వారిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఓ మామూలు విషయంగా మార్చేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందని ఈ ఫిర్యాదులో పేర్కొంది. ఉదయనిధి తక్షణమే నటి త్రిషకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జరిపి ఉదయనిధిపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ను కోరింది. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించినందుకు ఉదయనిధిపై పోలీసులు తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా తమిళనాడువ్యాప్తంగా ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకత్వం ప్రకటించింది. మరోవైపు ఈ వివాదంలో ఉదయనిధి స్టాలిన్పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి, ఖుష్బూ ఈ వ్యాఖ్యలను ఖండించారు. దేశంలో చట్టాలు మహిళల రక్షణ కోసం ఉన్నాయని, వెంటనే పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీవీకే నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయనిధి స్టాలిన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఆరు సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు.. చెన్నైలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇంటి వెలుపల భారీగా దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్ట్ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్.. యాంటిసిపేటరీ బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ దాఖలు చేశారు. ఈలోపే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.బంగారం ధరల్లో ఊపశమనం: ఆభరణాల కొనుగోళ్లపై
బుమ్రా వ్యవహారంలో మొత్తానికి ఓపెన్ అయ్యాడు- అజిత్ అగార్కర్ అన్ హ్యాపీ
నాగ పంచమి ఎప్పుడు, ఏ రోజున జరుపుకోవాలి