చైనాలో వరదలు ప్రాణనష్టం, ఆస్తినష్టంతో పాటు కొత్త భయాన్ని కూడా తెచ్చాయి. భారీ వర్షాలకు ఒక పాముల పెంపక కేంద్రం దెబ్బతినడంతో అక్కడి నుంచి సుమారు 900 పాములు బయటకు వెళ్లిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వరద నీరు తగ్గని ప్రాంతాల్లో ఈ పరిణామం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది.
చైనాలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు, ఆకస్మిక వరదలు జనజీవనాన్ని దెబ్బతీశాయి. అధికారుల సమాచారం ప్రకారం కనీసం 20 మంది మరణించగా, 331 మంది గాయపడ్డారు. రహదారులు నీటమునిగాయి. ఇళ్లు, వ్యవసాయ భూములు, స్థానిక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతున్నాయి.
వరద ప్రభావిత ప్రాంతంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పాములను పెంచుతున్న కేంద్రం నీటికి దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడి గోడలు, కంచెలు దెబ్బతినడంతో పాములు బయటకు వచ్చి వరద నీటితో చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. వాటిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. స్థానికులకు అవసరం లేకుండా బయటకు రావద్దని, నీటితో నిండిన పొలాలు, చెట్ల పొదలు, విడిచిపెట్టిన భవనాల వద్ద జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పాము కనిపిస్తే స్వయంగా పట్టుకునేందుకు ప్రయత్నించవద్దని, వెంటనే స్థానిక అత్యవసర బృందాలకు సమాచారం ఇవ్వాలని హెచ్చరిస్తున్నారు. వరద సమయంలో పాములు పొడి ప్రదేశాల కోసం ఇళ్ల సమీపానికి చేరే అవకాశముంటుంది. వరద పరిస్థితులపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రాణనష్టం మరింత పెరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. రక్షణ, వైద్య, పునరావాస చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రస్తుతం అధికారుల ప్రధాన దృష్టి రెండు అంశాలపై ఉంది. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తప్పించుకున్న పాములను గుర్తించి ప్రజలకు ప్రమాదం లేకుండా చూడడం. వాతావరణ హెచ్చరికలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అధికారిక సూచనలను పాటించాల్సిందేనని స్థానిక యంత్రాంగం స్పష్టం చేస్తోంది.వరదల్లో కొట్టుకుపోయిన పాముల పెంపక కేంద్రం
ప్రభుత్వ యంత్రాంగానికి షీ జిన్పింగ్ ఆదేశాలు