బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివార్లలో సోమవారం రాత్రి దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. నూతనంగా ఏర్పాటైన 'నేషనల్ సిటిజన్ పార్టీ' (ఎన్సీపీ) నిర్వహించిన ఓ బహిరంగ సభ లక్ష్యంగా భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, భద్రత బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసిన విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఈ ఎన్సీపీ పార్టీని స్థాపించారు. దేశంలో ప్రజాభిప్రాయ సేకరణను వెంటనే అమలు చేయాలని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రదర్శనలు చేపట్టారు. ఈ క్రమంలోనే సవర్ ఠానా స్టాండ్ ఈద్గా మైదానంలో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఎన్సీపీ నేతలు ప్రసంగిస్తోన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది.
బంగ్లాదేశ్లో గతంలో జరిగిన విద్యార్థి నిరసనల రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పార్టీ 'జులై మార్చ్' పేరుతో నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఈ నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు విజయవంతం అవుతున్నాయని, ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని విద్యార్థి నాయకులు ఇది వరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాము నిర్వహించిన బహిరంగ సభపై దుండగులు ఉద్దేశపూర్వకంగానే బాంబులతో దాడికి పాల్పడ్డారని ఎన్సీపీ ఆరోపించింది. ఈ ఆకస్మిక దాడి అక్కడున్న వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానిక పోలీసులు, భద్రత సిబ్బంది వెంటనే స్పందించి ఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్లో రాజకీయ చైతన్యం పెరిగినప్పటికీ, దేశంలో శాంతిభద్రతల పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని ఎన్సీపీ మండిపడుతోంది. నూతన ప్రభుత్వం ఏర్పాటైనా ఇక్కడి పరిస్థితుల్లో ఎటువంటి మార్పూ రాలేదని, ఉద్యోగాలు లేవని, నిత్యావసర ధరలు అందుబాటులో ఉండట్లేదని ధ్వజమెత్తుతోంది. 2024 ఆగస్టు 5న ప్రధాని పదవికి రాజీనామా చేసిన అనంతరం షేక్ హసీనా భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడే శరణార్థిగా ఉంటోన్నారు. షేక్ హసీనాను తమకు అప్పగించాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరుతోంది. అదే సమయంలో ఆమెకు వ్యతిరేకంగా నేషనల్ సిటిజన్ పార్టీ ఈ దేశవ్యాప్త ర్యాలీలకు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటువంటి హింసాయుత ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.