ఆ విషయంలో పాకిస్థాన్ తో మాకు పోలికేంటి..? ఇచ్చి పడేసిన భారత్

పశ్చిమాసియా సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహించే విషయంలో భారత దౌత్య విధానాన్ని పాకిస్థాన్ తో పోల్చడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. బీజింగ్‌ లోని ప్రముఖ త్సింగూవా విశ్వవిద్యాలయం నిర్వహించిన వరల్డ్ పీస్ ఫోరమ్‌లో భారత దౌత్యవేత్త విక్రమ్ దొరైస్వామి ఈ అంశంపై మాట్లాడారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఇలాంటి పోలిక తీసుకురావడం ఎంతవరకూ సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

సదస్సులో భాగంగా ఒక చైనా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు దొరైస్వామి ఘాటుగా సమాధానమిచ్చారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ఇస్లామాబాద్ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. రెండు దేశాల ఆర్థిక పరిస్థితులను గమనిస్తేనే వాటి మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై ఏ దేశాన్ని అయినా ఆ దేశం చేసే పనుల ఆధారంగానే అంచనా వేయాలని సూచించారు.

Advertisement

అంతర్జాతీయ భాగస్వామ్యంపై భారత్ ముద్ర

ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అంతర్జాతీయ వ్యవస్థలో భారత్ భాగస్వామ్యం చాలా బలంగా ఉందని దొరైస్వామి వివరించారు. ఐరోపా, ఆసియా దేశాలతో భారత్‌ కు ఉన్న ఆర్థిక బంధాలు దీనికి నిదర్శనమని చెప్పారు. ప్రపంచ శాంతి, భద్రతల రక్షణ కోసం తమ వంతు సహకారం అందించడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే వివాదాల్లో మధ్యవర్తిత్వం అనేది కేవలం ఆయా దేశాల జాతీయ ప్రయోజనాలకు లోబడి ఉంటుందని వెల్లడించారు.

పశ్చిమాసియా లేదా తూర్పు ఐరోపా (ఉక్రెయిన్) సంక్షోభాల విషయంలో భారత్, చైనా దేశాల దౌత్య విధానాలు దాదాపు ఒకే రీతిలో ఉన్నాయని దొరైస్వామి గుర్తుచేశారు. ఈ వివాదాల పరిష్కారం కోసం ఇప్పటికే అంతర్జాతీయంగా అనేక దేశాలు రంగంలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రద్దీగా మారిన ఈ దౌత్య వేదికపై తాము ప్రత్యేకంగా మధ్యవర్తిత్వం వహించడం వల్ల దేశ ప్రయోజనాలకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

గతంలో భారత్ ఇలాంటి అనేక మధ్యవర్తిత్వ పాత్రలను విజయవంతంగా పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం భారత్ లేదా చైనా దేశాలు పశ్చిమాసియా సంక్షోభంలో నేరుగా మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకు రావడం లేదని స్పష్టం చేశారు. ఈ సదస్సులో దొరైస్వామి గ్లోబల్ గవర్నెన్స్ నమూనాలపై జరిగిన ప్యానెల్ చర్చలో పాల్గొని భారత్ గ్లోబల్ విజన్‌ ను స్పష్టంగా వివరించారు.

English Summary

Indian diplomat Vikram Doraiswami, speaking at the World Peace Forum in Beijing, firmly rejected comparisons between India’s geopolitical approach and Pakistan’s diplomatic efforts in the West Asia crisis. He highlighted India’s strong global engagement and clarified that mediation roles are contingent upon national interests rather than generic comparisons between the two nations.