లోయలో పడిన బస్సు.. 40 మంది దుర్మరణం!

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో శుక్రవారం ఓ భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ఓ ప్రయాణీకుల బస్సు పర్వత ప్రాంతం నుంచి లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్థాన్‌లోని షేరానీ జిల్లా ధనాసర్ ప్రాంతం మీదుగా ఖైబర్ పఖ్తుంఖ్వా వైపు వెళ్తుండగా.. ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. క్వెట్టా నుంచి పెషావర్ నగరానికి వెళ్తున్న ఈ బస్సులో ప్రమాద సమయంలో మొత్తం 48 మంది ప్రయాణీకులు ఉన్నారు.

Advertisement

ఈ ప్రమాదంలో 40 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ బస్సు మొదట క్వెట్టా నుంచి 36 మంది ప్రయాణీకులతో బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో మరో బస్సు పాడైపోవడంతో ఆ బస్సులోని ప్రయాణీకులు కూడా ఇందులో ఎక్కారు. దీనివల్ల బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణీకులు పెరిగిపోవడంతో పాటు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే బస్సు నియంత్రణ కోల్పోయి పర్వతం పైనుంచి కింద ఉన్న లోయలోకి పడిపోయిందని షేరానీ డిప్యూటీ కమిషనర్ వలీ ఖాన్ కాకర్ వెల్లడించారు.

Advertisement

ఈ ఘోర ప్రమాదం జరిగిన వెంటనే బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఆదేశాల మేరకు ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. రెస్క్యూ బృందాలు, స్థానిక జిల్లా యంత్రాంగం క్షతగాత్రులను వెలికితీసి చికిత్స నిమిత్తం ఝోబ్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన 8 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

English Summary

Pakistan Bus Accident, At least 40 passengers died and 8 were critically injured after an overcrowded, speeding bus plunged into a deep gorge in the Sherani district of Balochistan, Pakistan.