మోదీ స్నేహహస్తాన్ని కాదనుకుని పెద్ద తప్పు చేశాం: పాకిస్థాన్

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రత్యేక సలహాదారు రాణా సనావుల్లా ఖాన్.. భారత్ తో సంబంధాల విషయంలో ఓ సంచలన ప్రకటన చేశారు. భారత్‌తో సంబంధాలు క్షీణించడానికి తన సొంత దేశమైన పాకిస్థానే కారణమని ఆయన ఆరోపించారు. భారత ప్రధాని మోదీతో సంబంధాలను మెరుగుపరుచుకునే విషయంలో పాకిస్థాన్ ఓ సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకుందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధాని మోదీ స్వయంగా స్నేహహస్తం అందించినప్పటికీ.. పాకిస్థాన్ లో జరగిన రాజకీయ వ్యతిరేకత వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము మోదీ స్నేహహస్తం కోసం పరితపిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

సమా టీవీ చర్చా కార్యక్రమంలో పాక్ ప్రధాని ప్రత్యేక సలహాదారు రాణా సనావుల్లా మాట్లాడుతూ.. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ లాహోర్ ఆకస్మిక పర్యటనను ప్రస్తావిస్తూ.. పాకిస్థాన్ కు ఓ గొప్ప అవకాశం లభించిందని అన్నారు. అప్పట్లో నవాజ్ షరీఫ్ ప్రాంతీయ శాంతి కోసం కావాల్సిన వాతావరణాన్ని సృష్టించారని.. కానీ పాకిస్థాన్ లోని కొందరు మోదీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కామెంట్లు చేశారని మండిపడ్డారు. ఇంటికి వచ్చిన అతిథిని దూషించి.. ఇప్పుడు వారి కరచాలనం కోసం ఎదురుచూడటం పాకిస్థాన్ దురదృష్టకర పరిస్థితికి అద్ధం పడుతోందని రాణా సనావుల్లా వెల్లడించారు.

Advertisement

పాకిస్థాన్ ప్రస్తుతం తెరవెనుక దౌత్యం ద్వారా భారత్ తో సంప్రదింపులు జరుపుతోందా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ఆయన అవునని అంగీకరిస్తూ.. రహస్య దౌత్యం ఎప్పుడూ ఆగలేదని చెప్పారు. గతంలో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటే.. ఈ రోజు పాకిస్థాన్ దేశానికి ఐఎంఎప్ వంటి అంతర్జాతీయ సంస్థల ముందు అప్పుల కోసం చేయి చాచాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాల నుంచి దేశం బయటపడేదని ఆయన స్పష్టం చేశారు.

English Summary

Pakistan Prime Minister Shehbaz Sharif Special Adviser Rana Sanaullah Khan has made a sensational statement regarding relations with India. He blamed his own country, Pakistan, for the deterioration of relations with India.