పాకిస్తాన్ సర్వసైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ కు న్యూ టాస్క్- ఇకపై: తెరవెనుక అధికార కేంద్రం


పాకిస్తాన్ సర్వసైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి తెరమీదికి వచ్చారు. పాకిస్తాన్ ప్రభుత్వ పాలనలో కీలక భాగస్వామి అయ్యారు. నూతన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటికే తెరవెనుక అసలైన అధికార కేంద్రంగా చలామణి అవుతున్నట్లు భావిస్తోన్న ఆసిమ్ మునీర్.. ఇప్పుడు నేరుగా ఆ దేశ పాలనలో అడుగుపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించబోతోన్నారు.

Advertisement

దేశంలో శరవేగంగా పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి ఉద్దేశించిన కమిటీలో ఆసిమ్ మునీర్ కు సభ్యత్వం కల్పించిందక్కడి ప్రభుత్వం. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఆయనకు కూడా సభ్యత్వం కల్పించారు. దేశంలో అత్యంత వేగంగా పెరిగిపోతున్న జనాభాను నియంత్రించేందుకు ఉద్దేశించిన కమిటీ ఇది. దీనికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన, అమలు తీరును నేరుగా పర్యవేక్షించనున్నారు ఆసిమ్ మునీర్.

Advertisement

ఈ మేరకు పాక్ ఫెడరల్ హెల్త్ మినిస్టర్ సయ్యద్ ముస్తఫా కమల్ ఓ ప్రకటన చేశారు. పార్లమెంట్ హౌస్ కమిటీ జాయింట్ సమావేశంలో ఈ సమాచారాన్ని వెల్లడించారు. జనాభా పెరుగుదల సమస్యను అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా గుర్తించామని, అందువల్లే సర్వ సైన్యాధ్యక్షుడిని కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించాల్సి వచ్చిందని వివరించారు. ప్రభుత్వం నియమించిన ఓ పాలనపరమైన కమిటీలో ఆయనకు సభ్యత్వం లభించడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకంది..

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో పాకిస్తాన్ అయిదో స్థానంలో కొనసాగుతోంది. ఇదే వేగంతో జనాభా పెరుగుదల కొనసాగితే.. రాబోయే 2030 నాటికి ఆ దేశం ఇండోనేషియాను సైతం దాటేసి ప్రపంచంలోనే నాలుగో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి ఏటా సుమారు 67 లక్షల మంది పిల్లలు జన్మిస్తున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement

కుటుంబ నియంత్రణ పద్ధతులు అందుబాటులో లేకపోవడం, జనాభా పెరుగుదల వల్ల ఏర్పడే సమస్యలపై అక్కడి ప్రజల్లో అవగాహన లేకపోవడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలు. పాకిస్తాన్‌లో అమలవుతున్న ఆర్థిక వనరుల పంపిణీ విధానం కూడా జనాభా నియంత్రణకు శాపంగా మారింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రావిన్సులకు కేంద్ర నిధుల కేటాయింపు సుమారు 82 శాతం వరకు అక్కడి జనాభా ప్రాతిపదికన జరుగుతుంది.

దీనివల్ల ఏదైనా ప్రావిన్స్ లో జనాభా తగ్గితే.. దానికి అందే నిధుల వాటా మరింత తగ్గిపోతుంది. దీన్ని నివారించేందుకు నిధుల కేటాయింపులో జనాభా వాటాను 82 శాతం నుంచి ఏకంగా 50 శాతానికి తగ్గించాలని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. పాకిస్తాన్ రాజ్యాంగంలోని 18వ సవరణ ప్రకారం జనాభా సంక్షేమ బాధ్యతలు ప్రాంతీయ ప్రభుత్వాల పరిధిలోనే ఉంటాయి. ఈ క్రమంలోనే కేంద్రం, ప్రావిన్సుల మధ్య సమన్వయం సాధించేందుకు ఆర్మీ చీఫ్‌తో పాటు ఆర్థిక, ప్రణాళిక, ఆరోగ్య శాఖల మంత్రులను ఈ కమిటీలోకి తీసుకున్నారు.

English Summary

Pakistan Makes Population Control a National Priority as Army Chief Asim Munir Added to Key Committee. The new job for Munir comes at a precarious time for Pakistan, which is already dealing with security issues in Balochistan and near the Afghan border.