పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. 13 మంది మృతి

పాకిస్థాన్ లోని ఖైబర్​ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 13 మంది మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు. నార్త్ వెస్ట్ పాకిస్థాన్ లోని ఖైబర్​ పఖ్తుంఖ్వా లో ఓ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. స్వాట్ జిల్లాలోని కాబల్ టౌన్ లో నిర్వహించిన స్వాట్ పీస్ ర్యాలీలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించాయి. ఘటనా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తును ప్రారంభించాయి. ఈ దాడిలో 13 మంది మృతి చెందారు. వారిలో దాదాపు 8 మంది పోలీసులు ఉన్నారు. ఈ విషయాన్ని స్వాట్ జిల్లా డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఫిదా హుస్సెయిన్ ధృవీకరించారు.

ఓ సూసైడ్ బాంబర్ పోలీస్ స్టేషన్ లోకి రాబోతుండగా పోలీసులు అతడ్ని మెయిన్ గేట్ వద్దే ఆపారు. పీటీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం స్థానిక ట్రైబ్ కౌన్సిల్ అయిన స్వాట్ అమన్ జిర్గా ర్యాలీని ఏర్పాటు చేశారు. నిరసనకారులంతా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తమ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఆత్మాహుతి దాడి జరిగింది.. అని ఫిదా హుస్సెయిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.