అమెరికా పశ్చిమ తీరంలోని వాషింగ్టన్.. ప్రకృతి ప్రకోపానికి గురైంది. శివార్లలోని స్పోకేన్ సిటీ, దాని పరిసర ప్రాంతాలను దావానలం వణికించివేస్తోంది. ఈ నగర చరిత్రలోనే ఊహించని రీతిలో సంభవించిన ఈ కార్చిచ్చు ప్రకోపానికి అనేక గృహాలు కాలి బూడిద అయ్యాయి. అగ్ని కీలలు నివాస ప్రాంతాలను వేగంగా చుట్టుముట్టడంతో వందలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశాయి. దట్టమైన నల్లటి పొగ కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించడంతో ఈ ప్రాంతం నరకప్రాయంగా మారింది.
ఈ ఘోర విపత్తు నివారణలో భాగంగా వాషింగ్టన్ గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ ఎమర్జెన్సీని ప్రకటించారు. సహాయక చర్యల కోసం నేషనల్ గార్డ్ బలగాలను సైతం రంగంలోకి దించినట్లు వెల్లడించారు. నార్త్ ఇండియన్ ట్రయిల్ రోడ్డు మార్గంలో మంటలు వేగంగా నివాసాల వైపు దూసుకురావడంతో.. లెవెల్ 3 స్థాయి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు అధికారులు. మంటలను అరికట్టడానికి, ప్రమాద తీవ్రతను తగ్గించడానికి విపత్తు నిర్వహణ బలగాలు శ్రమిస్తోన్నాయి.
గాలిలో తేమ శాతం పడిపోవడం, తీవ్రమైన ఎండలు, గంటకు దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలుల వల్ల మంటలు అదుపులోకి రావట్లేదు. మరింత విస్తరిస్తూ వస్తోన్నాయి. ఈ నేపథ్యంలో.. నేషనల్ వెదర్ సర్వీస్ పర్టిక్యులర్లీ డేంజరస్ సిట్యువేషన్ రెడ్ ఫ్లాగ్ హెచ్చరికను జారీ చేసింది. ఇటువంటి రెడ్ ఫ్లాగ్ జారీ కావడం ఇదే మొదటిసారి. అత్యంత పొడి వాతావరణంలో కార్చిచ్చు అత్యంత వేగంగా, అదుపు చేయలేని విధంగా చెలరేగినప్పుడు మాత్రమే ఇలాంటి అత్యవసర హెచ్చరికలను జారీ చేస్తుంటారు. ఈ అగ్ని కీలలు సాధారణమైనవి కావని స్పోకేన్ పబ్లిక్ ల్యాండ్స్ కమిషనర్ డేవ్ అప్ట్గ్రోవ్ పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న ఓల్డ్ ట్రయిల్స్ దావానలం నదీ పరివాహక ప్రాంతాలను దాటుకుంటూ నేరుగా జనావాసాలపైకి చొచ్చుకు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అడవులలో మండుతున్న నిప్పు రవ్వల కారణంగా చుట్టుపక్కల వందలాది పచ్చని చెట్లు నిమిషాల వ్యవధిలోనే మసిదిబ్బలుగా మారిపోతున్నాయని అన్నారు. మంటల వ్యాప్తి కారణంగా రోడ్డు మార్గాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయాయి దీంతో అత్యవసర సేవల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్పొకానేకు దారి తీసే కొన్ని రోడ్లను మూసివేశారు. ఓల్డ్ ట్రయిల్స్, ఫెయిర్వ్యూ, ఆటమ్ లేన్ ప్రాంతాలలో కూడా దావానలం విస్తరించింది. ఇప్పటివరకు జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను అధికారులు అంచనా వేస్తున్నారు. అడవి మంటల వ్యాప్తికి గల మూల కారణాలను గుర్తించడానికి ఈ ప్రాంతంలో ప్రత్యేక పరిశోధక బృందాలు క్షేత్రస్థాయి దర్యాప్తును ముమ్మరం చేశాయి.2018 కంటే వరస్ట్ ఫ్లడ్ హిట్- ఆలువ శివాలయం నీట మునిగిందంటే..!!
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఈ వారంలో ఇంకా తగ్గే అయ్యే ఛాన్స్?