పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శాంతి మంత్రం: బిగ్ స్టెప్- ఒప్పించేలా

మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హోర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ చమురు నౌకలపై జరిగిన దాడులకు ప్రతిచర్యగా అమెరికా సైన్యం ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరాన్‌కు చెందిన సుమారు 80 వ్యూహాత్మక సైనిక స్థావనాలపై క్షిపణులతో దాడులు చేసింది. ఈ ఆకస్మిక పరిణామంతో పశ్చిమాసియా, మధ్యప్రాచ్యం మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. గల్ఫ్ రీజియన్‌లో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

వీటిని నివారించే దిశగా పాకిస్తాన్ ముందడుగు వేసింది. అమెరికా, ఇరాన్ మధ్య స్తంభించిపోయిన శాంతి చర్చల ప్రక్రియను పునరుద్ధరించే ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్.. సంప్రదింపులు ప్రారంభించారు. మధ్యవర్తిత్వం వహించడానికి, ఇస్లామాబాద్ వేదికగా అమెరికా- ఇరాన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు నిర్వహించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఇందులో ఎటువంటి రాజీ ధోరణీ ఉండబోదని తేల్చి చెప్పారు.

Advertisement

దీనిపై పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఓ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో జరిపిన సంభాషణకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. పశ్చిమాసియాలో తిరిగి చోటు చేసుకుంటోన్న ఉద్రిక్తతలపై ప్రధానమంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని తెలిపింది. శాంతియుత వాతావరణంలో చర్చలను పునరుద్ధరించాల్సిన తక్షణ అవసరం ఉందని షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేసినట్లు వివరించింది.

నాలుగైదు నెలలుగా కష్టపడి సాధించిన శాంతియుత ప్రక్రియ, దౌత్య సంబంధాల పునరుద్ధరణను ప్రమాదంలో పడేసే ఎలాంటి చర్యలకైనా దూరంగా ఉండాలని, సంయమనం పాటించాలని షెహబాజ్ షరీఫ్ ఈ సందర్భంగా అమెరికా, ఇరాన్ ను కోరారు. గతంలో ఇస్లామాబాద్ లో కుదిరిన అవగాహన ఒప్పందం కింద చేపట్టిన చర్యలు, రూపొందించుకున్న కట్టుబాట్లను నిలబెట్టుకోవాల్సిన ప్రాముఖ్యతను షరీఫ్ గుర్తు చేశారు. పశ్చిమాసియాలో ఉమ్మడి శ్రేయస్సును పెంపొందించడానికి ఓ ఫ్రేమ్ వర్క్ గా ఉపయోగపడుతుందని అభివర్ణించారు.

Advertisement

పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించే విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నామని, నిబద్ధతను ఎప్పటికప్పుడు చాటుకుంటున్నామని షరీఫ్ గుర్తు చేశారు. శాంతిచర్చలను ముమ్మరం చేయడానికి ఉద్దేశించిన ఏ ప్రయత్నానికైనా తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పెజెష్కియన్‌కు హామీ ఇచ్చారు. సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైనందుకు పెజెష్కియన్ ఈ సందర్భంగా షరీఫ్ తో పాటు ఇషాక్ దార్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ఇతర సీనియర్ పాకిస్తానీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

అదే సమయంలో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో షెహబాజ్ షరీఫ్ టెలిఫోన్ లో మాట్లాడారు. ఇటీవలి దాడులపై ఖతార్ ప్రజలకు సంఘీభావాన్ని తెలియజేశారు. సంయమనం పాటించాలని, ఈ రీజియన్ లో శాంతికి భంగం కలిగించే ఎలాంటి చర్యలకైనా దూరంగా ఉండాలని కోరారు. నిరంతర దౌత్య సంబంధాలు, సంభాషణల ప్రాముఖ్యత, శాంతి ఒప్పందం కింద అన్ని పక్షాలు చేసిన కట్టుబాట్లకు కట్టుబడి ఉండటంపైనా సూచించారు.

English Summary

Shehbaz Sharif Meets Iran and Qatar Leaders as Pakistan Steps Up Diplomatic Push for US-Iran Talks. The leaders also reviewed the implementation of the decisions taken during President Pezeshkian's visit to Islamabad last month and agreed to expedite follow-up actions.