రణరంగంగా మారిన జైలు: 25 మంది మృతి, 100 మందికి తీవ్ర గాయాలు!

శ్రీలంకలోని ఓ ప్రధాన జైలులో ఖైదీల మధ్య జరిగిన రగడ తీవ్ర విషాదాన్ని నింపింది. రెండు డ్రగ్స్ ముఠాలకు చెందిన ఖైదీల మధ్య జరిగిన ఈ గొడవలో నలుగురు జైలు గార్డులతో సహా మొత్తం 25 మంది మరణించారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గత ఐదేళ్ల కాలంలో శ్రీలంక జైళ్ల చరిత్రలోనే అది అత్యంత ఘోరమైన, అత్యంక ప్రాణాంతకమైన జైలు ఘర్షణగా అధికారులు సోమవారం ప్రకటించారు.

Advertisement

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొలంబోకు ఉత్తరాన ఉన్న నెగొంబో ప్రాంతంలోని ప్రధాన జైలులో ఆదివారం సాయంత్రం ఈ ఘర్షణ ప్రారంభమైంది. వేలాది మంది ఖైదీలు ఉన్న ఈ జైల్లోని రెండు డ్రగ్స్ ముఠాల మధ్య మొదలైన గొడవ రాత్రంతా కొనసాగి రణరంగంగా మారింది. ఈ అల్లర్లను అదుపు చేయడానికి ప్రయత్నించిన నలుగురు జైలు గార్డులు కూడా ఖైదీల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయానికి పరిస్థితి పూర్తిగా చేజారిపోవడంతో అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

Advertisement

గాయపడిన జైలు సిబ్బందితో పాటు ఖైదీలను తక్షణమే నెగొంబోలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి డైరెక్టర్ పుష్ప గంలత్ మీడియాతో మాట్లాడుతూ.. తమ వైద్య కేంద్రానికి ఇప్పటివరకు 25 మృతదేహాలు వచ్చాయని.. గాయపడిన 100 మందికి పైగా ఖైదీలు, గార్డులకు అత్యవసర చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. బాధితుల్లో కొందరికీ తుపాకీ గాయాలు కాగా.. మరికొందరిక పదునైన ఆయుధాల కోతలు, తీవ్రమైన గాయాలయ్యాయని ఆమె పేర్కొన్నారు. జైలు లోపల కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు కూడా వెల్లడించారు.

మరోవైపు జైలులో ఘర్షణల వార్త వ్యాపించడంతో పక్కనే ఉన్న మహిళా ఖైదీల విభాగంలో కూడా ఉద్రిక్తత నెలకొంది. తమను కూడా వెంటనే విడుదల చేయాలంటూ ఆదివారం రాత్రి మహిళా ఖైదీలు జైలు భవనం పైకప్పు పైకి ఎక్కి నిరసనకు దిగారు. ఈ క్రమంలో భవనం పైకప్పులోని ఒక భాగం కూలిపోవడంతో కొందరు మహిళా ఖైదీలకు కూడా గాయాలయ్యాయి. పరిస్థితిని సమీక్షించడానికి సోమవారం ఉదయం పోలీసు కమాండోలను రప్పించినప్పటికీ.. వారిని జైలు లోపలికి మాత్రం పంపలేదు. ఖైదీల ప్రాణాల గురించి ఆందోళనతో వారి కుటుంబసభ్యులు భారీ సంఖ్యలో జైలు బయట గుమిగూడారు. దీంతో ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి ఎయిర్ఫోర్స్ రంగంలోకి దిగి డ్రోన్లు, హెలికాప్టర్లను మోహరించింది.

Advertisement

English Summary

A deadly prison riot between two rival drug gangs in Sri Lanka's Negombo jail leaves 25 dead, including four guards, and over 100 injured. Air Force deploys drones and helicopters.