మన దేశంలోని ఒక చిన్న హోటల్లో తిన్న ఒక్క ప్లేట్ బిర్యానీ.. ఒక విదేశీ టూరిస్ట్ జీవితాన్నే మార్చేస్తుందని ఎవరైనా ఊహిస్తారా? సాధారణంగా విదేశీయులు మన దేశానికి వస్తే ఇక్కడి ప్రదేశాలను చూసి వెళ్తుంటారు. కానీ, జపాన్కు చెందిన తకామసా ఒసావా అనే వ్యక్తి మాత్రం ఇక్కడి బిర్యానీ రుచికి ఏకంగా తన జీవితాన్నే అంకితం చేశాడు. 15 ఏళ్ల క్రితం తమిళనాడులో జిహ్వచాపల్యాన్ని రేపిన ఆ బిర్యానీ ఘుమఘుమలు.. నేడు ఆయనను జపాన్ రాజధాని టోక్యోలో ప్రపంచ ప్రఖ్యాత 'మిచెలిన్' పురస్కారాన్ని గెలుచుకునే స్థాయికి తీసుకెళ్లాయి!
కథ 2009లో మొదలైంది. ఒక సాధారణ జపనీస్ పర్యాటకుడిగా తన స్నేహితుడితో కలిసి తమిళనాడులోని కోయంబత్తూర్ వచ్చిన ఒసావా.. ఆకలి వేసి ఒక స్థానిక హోటల్లో అడుగుపెట్టాడు. అంతవరకు తనకు పెద్దగా పరిచయం లేని 'బిర్యానీ'ని ఆర్డర్ చేశాడు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆయనకు కొత్త ప్రపంచం కనిపించింది. ఆ ఘుమఘుమలు, నిండిన మసాలా రుచులు ఆయనను ఎంతలా కట్టిపడేసాయి అంటే.. ఆ ఒక్క రోజే వరుసగా నాలుగు వేర్వేరు హోటళ్లకు వెళ్లి నాలుగైదు ప్లేట్ల బిర్యానీలను లాగించేశాడు. ఆ రోజు మొదలైన ఆ బిర్యానీ ప్రేమ.. ఆయనలోని పాకశాస్త్ర ప్రవీణుడిని నిద్రలేపింది.
నోరూరించే బిర్యానీ తయారీ వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోవడమే ధ్యేయంగా ఒసావా దక్షిణ ఆసియా అంతటా సుదీర్ఘ పర్యటన చేశాడు. హైదరాబాద్, చెన్నై, కొచ్చి, లక్నో, కలకత్తా వీధుల్లోని ప్రసిద్ధ బావర్చీల దగ్గర చేరి బిర్యానీ వండటం నేర్చుకున్నాడు. అంతేకాదు, సరిహద్దులు దాటి పాకిస్థాన్, బంగ్లాదేశ్లలోని వంటశాలల్లో కూడా శిక్షణ తీసుకున్నాడు. హైదరాబాద్ బిర్యానీ బేస్కు, కలకత్తా మసాలాలు, పాకిస్థానీ గ్రేవీ విధానాలను జోడించి తనకంటూ ఒక ప్రత్యేకమైన వంటకాన్ని రూపుదిద్దుకున్నాడు. ఇన్ని దేశాల రుచులు చూసినా.. ఇప్పటికీ తమిళనాడు బిర్యానీలోని ప్రతీ బియ్యపు గింజలో ఉండే రుచే తనకు అత్యంత ప్రియమైనదని ఒసావా చెబుతుంటారు. ఈ విపరీతమైన ఆసక్తే ఆయనను జపాన్ రాజధాని టోక్యోలోని కాండా ప్రాంతంలో 'బిరియాని ఒసావా' పేరిట కేవలం 10 సీట్లు మాత్రమే ఉండే ఒక చిన్న హోటల్ను ప్రారంభించేలా చేసింది. "బిర్యానీ లేదా చావు" (Biryani or Die) అనే సిద్ధాంతంతో పనిచేసే ఒసావా.. తన హోటల్లో కేవలం బిర్యానీ మాత్రమే విక్రయిస్తాడు. ఒకే ఒక డిష్ వడ్డిస్తూ ఆయన చూపించిన అసమానమైన నిజాయితీ, రుచికి గుర్తింపుగా 2026లో ఆయన రెస్టారెంట్కు ప్రతిష్టాత్మక 'మిచెలిన్ బిబ్ గౌర్మండ్' హానర్ లభించింది. ఏ కోయంబత్తూర్ వీధుల్లోనైతే ఈ ప్రయాణం మొదలైందో.. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత అదే భారతదేశానికి వచ్చి ముంబైలో తన చేతి వంటతో వందలాది మంది ఆహార ప్రియులను ఒసావా మురిపించడం విశేషం.మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు ఇకపై చికెన్ బిర్యానీ..!
హైదరాబాద్ నుంచి కలకత్తా దాకా బిర్యానీ వేట!
"బిర్యానీ ఆర్ డై".. టోక్యోలో మైండ్ బ్లాకింగ్ సక్సెస్!
గంగలో చికెన్ బిర్యానీ తింటే జైలుశిక్షా ? కోర్టుల తీరుపై సుప్రీం జడ్జి ఫైర్..!