దక్షిణ అమెరికా ఖండంలోని ప్రముఖ పర్యాటక దేశం పెరూలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన చారిత్రక నజ్యా లైన్స్ (Nazca Lines) సైడ్ సీయింగ్ కోసం పర్యాటకులతో తీసుకెళ్తున్న ఒక చిన్న విమానం ఉన్నట్టుండి నేలకూలింది. ఈ విషాదకర సంఘటనలో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది విదేశీ పర్యాటకులే ఉన్నట్లు స్థానిక పోలీసులు ధ్రువీకరించారు.
దక్షిణ పెరూలోని ఇకా ప్రాంతానికి చెందిన పిస్కో విమానాశ్రయం నుంచి ఈ టూర్ విమానం గాల్లోకి లేచింది. అయితే ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే సాంకేతిక లోపం లేదా ఇతర కారణాల వల్ల విమానం ఒక్కసారిగా కిందపడిపోయింది. కూలిన వెంటనే క్షణాల్లో ప్రమాద స్థలంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఎవరూ లోపలి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని, రెస్క్యూ టీమ్లు చేరుకునే లోపే విమానం పూర్తిగా కాలిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాదంలో 11 మంది పర్యాటకులు, ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీస్ మేజర్ జార్జ్ ఆండ్రాడే వెల్లడించారు.
ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన, మిస్టరీతో కూడుకున్న చారిత్రక ఆధారాల్లో 'నజ్యా లైన్స్' ఒకటి. క్రీస్తు పూర్వం 500 నుంచి.. క్రీస్తు శకం 500 మధ్య కాలంలో ఎడారి నేలపై చెక్కిన భారీ రేఖాచిత్రాలు ఇవి. పక్షులు, జంతువులు, విచిత్ర రూపాల ఆకారాల్లో కిలోమీటర్ల మేర ఉండే ఈ అద్భుతాలను నేలపై నుంచి చూస్తే ఏమీ అర్థం కావు. కేవలం విమానాలు లేదా హెలికాప్టర్ల ద్వారా ఆకాశం నుంచి చూస్తేనే ఆ బొమ్మల పరిమాణం, అందం స్పష్టంగా కనిపిస్తాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఈ చిత్రాలను చూసేందుకు ఏటా లక్షలాది మంది పెరూకు వస్తుంటారు. మాచు పిచ్చు, కుస్కో నగరాల తరహాలోనే పెరూ పర్యాటకంలో ఈ నజ్యా లైన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. గతేడాదిలోనే దాదాపు 41 లక్షల మంది విదేశీ పర్యాటకులు పెరూను సందర్శించారు. స్థానిక 'ఏరోడియానా' అనే పర్యాటక సంస్థకు చెందిన విమానమే ఈ ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా తెలిసింది. నిత్యం వందలాది విమానాలు తిరిగే ఈ ప్రాంతంలో ఉన్నట్టుండి ఇలాంటి దారుణం జరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టుల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. సొంత దేశంలోనే 22 ఏళ్ల నరకం.. 15 ఏళ్లు గొలుసులతో బంధీగా..
ఆకాశం నుంచే చూడాల్సిన ఆ పురాతన అద్భుతం!
74 ఏళ్ల తర్వాత కనిపించిన విమానం. మిస్టరీ ఫ్లైట్ దొరికేసినట్లేనా?
పర్యాటక రంగాన్ని కుదిపేసిన విషాదం