హైదరాబాద్: ఏ జీవి అయినా తన కన్న పిల్లలను ప్రాణపదంగా ప్రేమిస్తుంది. కానీ, ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న ఘటనలు ఇతర జీవుల్లో ఏమో గానీ, మనుషుల్లో మాత్రం మానవత్వం అనేది కనుమరుగవుతోందా? అనే సందేహం కలిగిస్తోంది. తాజా ఘటన చూస్తే అది నిజమేమోనని అనిపిస్తుంది. ప్రియుడి కోసం ఓ మహిళ తన కన్న బిడ్డకు చిత్రహింసలకు గురిచేసిన నగరంలోని మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఆ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగుకు చెందిన వెంకన్న, సరితలకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. కుమార్తె(ప్రస్తుతం మూడేళ్లు) జన్మించిన తర్వాత భర్తకు గతంలో రెండు పెళ్లిళ్లు జరిగినట్టు గుర్తించిన సరిత ఆయనతో గొడవపడింది.
ఈ క్రమంలో ఇరువురి మధ్య మనస్పర్థలు తీవ్రస్థాయికి చేరడంతో అతన్నుంచి విడిపోయింది. భార్యాభర్తల విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. ఈ పరిణామాల తర్వాత ఆమె కుమార్తెను వెంటబెట్టుకుని ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చింది. మూసారాంబాగ్లోని ఈస్ట్ ప్రశాంత్ నగర్లో అద్దె ఇంట్లో ఉంటూ..ఇళ్లలో పని మనిషిగా చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో డీసీఎం డ్రైవర్ వెంకటరెడ్డితో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. పోలీసుల సహకారంతో స్వచ్ఛంద సంస్థలు, చైల్డ్లైన్ అధికారులు.. సోమవారం చిన్నారిని రక్షించారు. చైల్డ్లైన్ ప్రతినిధి మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. సరితను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న వెంకటరెడ్డి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న కూతురు రేణుకను ఇద్దరూ కొంతకాలంగా చిత్రహింసలకు గురిచేస్తూ వస్తున్నారు. వేడి గరిటెతో వాతలు పెట్టడం, తీవ్రంగా కొట్టడం చేస్తున్నారు. వీరి పైశాచికాన్ని గమనించిన స్థానికులు ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితోపాటు స్వచ్ఛంద సంస్థలు, బాలల హక్కుల సంఘానికి సమాచారం అందించారు.