అమరావతి: రాష్ట్రంలొో కరోనా వైరస్ కథ మళ్లీ మొదటికొచ్చింది. సెకెండ్ వేవ్లో ఇదివరకటి కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగా పెరుగుతోంది. రోజు గడిచే కొద్దీ వేల సంఖ్యలో కొత్త కేసులు జమ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటోన్న అనేక రాష్ట్రాలు ఇప్పటికే పాక్షికంగా లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. రాత్రివేళ కర్ఫ్యూను విధించాయి. శని, ఆదివారాల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలను నిలిపివేశాయి. పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. ఇంటర్మీడిట్ ఎగ్జామ్స్ను వాయిదా వేసుకున్నాయి.
ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ ఉదయం తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ అమలు తీరు, ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లల్లో ఆక్సిజన్ నిల్వలు, పడకల కొరత, కొత్త కోవిడ్ సెంటర్ల ఏర్పాటు వంటి పలు అంశాలపై వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షల రద్దు, ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా, అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం వంటి విషయాలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ అడ్డు, అదుపు లేకుండా పెరుగుతున్నాయి. ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం.. కొత్తగా 6,582 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 22 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 9,62,037కు చేరుకుంది. ఇందులో 9,09,941 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంగా 7,430 మంది మరణించారు. 44,686 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఈ స్థాయిలో యాక్టివ్ కేసులు రికార్డయిన సందర్భాలు చాలా తక్కువ.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ముఖ్యమంత్రి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైద్య ఆరోగ్య, హోమ్, విద్యాశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు దీనికి హాజరు కానున్నారు. కోవిడ్ ఆంక్షలను మరింత కఠినతరం చేయడం, రాత్రి పూట కర్ఫ్యూ ఆంక్షలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేవాలయాలు, ఇతర మతపరమైన ప్రార్థనా కేంద్రాల్లో కూడా కరోనా ఆంక్షలను విధిస్తారని అంటున్నారు. బార్లు, రెస్టారెంట్ల పై ఆంక్షలు, మార్కెట్లు, దుకాణాలను తెరచి ఉంచే వేళలను కుదిస్తారని అంటున్నారు. సాయత్రం 6 లేదా రాత్రి 8 గంటల వరకే దుకాణాలను తెరచి ఉంచేలా చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది.
మరిన్ని విజయవాడ వార్తలు
లాక్డౌన్ ఉండబోదంటూ వైఎస్ జగన్ ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 16వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన దీన్ని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ పరిష్కారం కాదని తేల్చి చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టడం, గుంపులుగా తిరకగకుండా కట్టడి చేయడం, కరోనా ప్రొటోకాల్స్ను కట్టుదిట్టంగా అమలు చేయడం వంటి కార్యాచరణ ప్రణాళికల ద్వారా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించవచ్చంటూ పేర్కొన్నారు. వాటినే అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.