మానవుడు ప్రకృతి సహజ సూత్రాలలో జోక్యం చేసుకుని చేసే చిన్నచిన్న ప్రయోగాలు కొన్నిసార్లు ఊహించని మలుపులు తిరుగుతాయి. దాదాపు 170 ఏళ్ల క్రితం అమెరికాలో జరిగిన ఒక ఆసక్తికర ఉదంతం దీనికి ప్రత్యక్ష నిదర్శనం. కీటకాలు, గొంగళి పురుగుల నుంచి చెట్లను కాపాడటానికి న్యూయార్క్లోని ఒక చిన్న పార్కులో కేవలం 16 పిచ్చుకలను వదిలిపెట్టారు. కానీ, కొద్ది దశాబ్దాల్లోనే ఆ పదహారు పక్షుల సంతతి ఏకంగా కోట్లకు పెరిగి, ఉత్తర అమెరికా ఖండం నలుమూలలా విస్తరించి ఒక పెద్ద సవాలుగా మారిపోతుందని అప్పట్లో ఎవరూ ఊహించలేకపోయారు.
1851వ సంవత్సరంలో అమెరికాలోని బ్రూక్లిన్ నగరంలో చెట్లకు గొంగళి పురుగుల బెడద తీవ్రంగా ఉండేది. వీటిని అరికట్టేందుకు యూరప్, ఆసియా ప్రాంతాల్లో సమృద్ధిగా కనిపించే 'హౌస్ స్పారో' (ఇంటి పిచ్చుక) జాతికి చెందిన పక్షులను అక్కడికి తీసుకెళ్లారు. స్వదేశీ వాతావరణం గుర్తొస్తుందనే భావనతో పాటు, చెట్లను కీటకాల నుంచి కాపాడుకోవచ్చని భావించి అక్కడ విడుదల చేశారు. అయితే, మొదట్లో వందలాది పక్షులను విడుదల చేశారని భావించినప్పటికీ... పరిశోధనల్లో బయటపడిన నిజం ఏంటంటే, నాటి సక్సెస్ఫుల్ ప్రయోగానికి పునాది పడింది కేవలం 16 పిచ్చుకలతోనే!
సైన్స్ పరిభాషలో దీనిని 'ఫౌండర్ ఎఫెక్ట్' అంటారు. సాధారణంగా అతికొద్ది సంఖ్యలో ఉండే ఒక జీవి సమూహం వేగంగా క్షీణించి అంతరించిపోతుంటుంది. కానీ ఈ పిచ్చుకల విషయంలో పూర్తి భిన్నంగా జరిగింది. ఆ పదహారు పక్షులు అక్కడి వాతావరణానికి వేగంగా అలవాటుపడి, విపరీతంగా సంతానోత్పత్తి చేశాయి. 1900 నాటికి ఇవి అమెరికాలోని పర్వత ప్రాంతాలను దాటుకుంటూ దేశమంతటికీ పాకిపోయాయి. కెనడాలోని మంచు ప్రాంతాలు మినహాయించి, ఉత్తర అమెరికా ఖండమంతటా వీటి సామ్రాజ్యం విస్తరించింది. ఈ పిచ్చుకలు ఇంత త్వరగా విస్తరించడానికి వాటి ఆహార అలవాట్లు, చాకచక్యమే ప్రధాన కారణం. ఇవి కేవలం కీటకాలపైనే ఆధారపడకుండా ధాన్యాలు, విత్తనాలు, విసిరేసిన ఆహార వ్యర్థాలను తినడం మొదలుపెట్టాయి. అంతేకాకుండా, అడవుల్లో కంటే మనుషులుండే పట్టణాలు, ఇళ్ల కప్పులు, విద్యుత్ స్తంభాలు, భవనాల కోణాల్లో తమ గూళ్లను కట్టుకోవడానికి ఇష్టపడ్డాయి. నగరాలు, వ్యవసాయ రంగాలు విస్తరిస్తున్న కొద్దీ ఈ పక్షుల జనాభా కూడా అదే స్థాయిలో అమాంతం పెరిగిపోయింది. మంచి ఉద్దేశంతోనే ప్రవేశపెట్టినప్పటికీ, కాలక్రమంలో ఈ పిచ్చుకల ప్రవర్తన స్థానిక పర్యావరణ వ్యవస్థకు పెద్ద తలనొప్పిగా మారింది. అమెరికాలోని స్థానిక పక్షులతో పోటీపడి, వాటి గూళ్లను ఆక్రమించడం, కొన్నిసార్లు ఇతర పక్షులపై దాడులు చేయడం వంటి తీవ్ర పరిణామాలకు దారితీశాయి. జీవవైవిధ్యంలో మానవుడు ప్రవేశపెట్టిన ఒక విదేశీ జాతి పక్షి... ఎంత త్వరగా పర్యావరణ సమతుల్యతను మార్చేయగలదో చెప్పడానికి ఈ 'పిచ్చుకల కథ' నేటికీ పర్యావరణ వేత్తలకు ఒక గొప్ప అధ్యయన పాఠంగా నిలిచిపోయింది.అమాంతం పెరిగిన సంఖ్య: విజ్ఞాన శాస్త్రానికి సైతం వింతే!
అపురూప అతిథి.. గడ్డి పరకల మధ్య దాక్కునే గడుసు పక్షి..
మానవ వికాసమే... వాటికి రహదారి!
40 ఏళ్లలో తలకిందులైన చరిత్ర, గడ్డి భూముల మహారాజు అస్తిత్వ పోరాటం
సహజ పర్యావరణానికి తప్పని ముప్పు!