అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఓ అరుదైన ఖగోళ ఘట్టానికి చందమామ వేదిక కాబోతోంది. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్ గతంలో ప్రయోగించిన ఫాల్కన్ 9 అప్పర్ స్టేజ్ చంద్రుడిని అత్యంత బలంగా ఢీ కొట్టబోతోంది. ఆగస్టు 5వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోనుంది. దీనివల్ల చంద్రుడిపై ఓ నూతన క్రేటర్.. అంటే భారీ కుహరం ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీని పరిణామాలపై అధ్యయనం చేయయనున్నారు.
దాదాపు ఏడాది కాలానికి పైగా అంతరిక్షంలో భూమి- చంద్రుడి కక్ష్యల మధ్య ఈ ఫాల్కన్ 9 రాకెట్ శకలం పరిభ్రమిస్తూ వస్తోంది. మానవ నిర్మిత కృత్రిమ వస్తువులు చంద్రుడిని ఢీకొట్టినప్పుడు సంభవించే మార్పులను ప్రత్యక్షంగా పరిశీలించడానికి ఖగోళ శాస్త్రవేత్తలకు ఇదొక అరుదైన అవకాశంగా మారనుంది. చంద్రుడి ఉపరితల రహస్యాలను శోధించడానికి ఇది ఎంతో సహాయపడనుంది.
ఈ రాకెట్ బరువు 4,899 కిలోలు. ఇంత బరువు ఉన్న ఓ రాకెట్ అప్పర్ స్టేజ్.. ప్రస్తుతం నియంత్రణ కోల్పోయింది. అత్యంత వేగంగా భూమి- చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ప్రస్తుతం అది చంద్రుడి వైపు దూసుకెళ్తోంది. ఆగస్టు 5వ తేదీన చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొట్టబోతోంది. ఈ సమయంలో దీని వేగం గంటకు సుమారు 8,690 కిలోమీటర్లకు పైగా ఉండొచ్చు. ఇది.. భూమిపై ప్రయాణించే సాధారణ ధ్వని వేగం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. చంద్రుడి పశ్చిమ అంచున ఉండే ఐన్స్టీన్ క్రేటర్ సమీపంలో ఇది క్రాష్ కానుంది. చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొన్నప్పుడు దాదాపు 3,000 కిలోల ప్రమాదకరమైన టీఎన్టీ పేలుడుకు సమానమైన శక్తి ఉత్పన్నమవుతుందని నాసా అంచనా వేసింది. ఖగోళ శాస్త్ర చరిత్రలో చంద్రుడి వెలుతురు ఉండే భాగంలో ఇలాంటి మానవ నిర్మిత వస్తువు ఢీకొనడం గానీ, దానికి సంబంధించిన కాంతిని పరిశీలించడం గానీ ఇప్పటివరకు నమోదు కాలేదు. అందుకే శాస్త్రవేత్తలు దీనిపై కన్నేసి ఉంచారు. ఈ ఫాల్కన్ రాకెట్ ఢీకొట్టిన తర్వాత సంభవించే పరిణామాలు, వెలువడే శక్తిని నిశితంగా పరిశీలించనున్నారు. చంద్రుడి ఉపరితలంపై ఉన్న ఎన్నో రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తోన్నారు. గత ఏడాది జనవరిలో రెండు కమర్షియల్ లూనార్ ల్యాండర్లను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ఈ ఫాల్కన్ 9 రాకెట్ ను అంతరిక్షంలోకి పంపారు. సాధారణంగా ఈ మిషన్ పూర్తయిన వెంటనే రాకెట్ చివరి భాగం భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోవాల్సి ఉంటుంది. అలా జరగలేదు. ఆ సందర్భంలో సాంకేతిక కారణాల వల్ల రాకెట్ గతి తప్పింది. ఈ పరిణామాన్ని మొదటిసారిగా ప్రముఖ ఖగోళ శాస్త్ర పరిశోధకుడు గ్రే తన బ్లాగ్ పోస్ట్లో వివరించారు. ఈ స్పేస్ జంక్.. భూ వాతావరణంలో ప్రవేశించి నశించిపోవడానికి బదులుగా చంద్రుడి కక్ష్యకు సమానమైన దూరంలో అత్యంత ఎత్తైన, అస్తవ్యస్తమైన కక్ష్యలోకి ప్రవేశించిందని ప్రకటించారు. క్రమంగా ఇది భాగం భూమి చుట్టూ తిరుగుతూ, గమనాన్ని కోల్పోయింది. చివరకు చంద్రుడి గురుత్వాకర్షణకు బందీ అయింది. అవుటర్ స్పేస్ లో ఉండే అత్యంత సూక్ష్మ సూర్యకాంతి ప్రభావానికి ఇది లోనైంది. దీని గమనాన్ని అంచనా వేయడం శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది. చివరికి.. పశ్చిమ దిశలో ఉండే ఐన్ స్టీన్ క్రేటర్ సమీపంలో ఇది చంద్రుడిని ఢీ కొడుతుందనే నిర్ధారణకు వచ్చారు. నాసాకు చెందిన క్రేటర్ శాటిలైట్ లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్.. ఈ క్రాష్ జరగడానికి ముందు, ఆ తర్వాత చంద్రుడిపై ఉన్న లొకేషన్ పరిస్థితులను హైరిజల్యూషన్ చిత్రాల రూపంలో సేకరించనుంది. దక్షిణ కొరియా పంపిన పాత్ఫైండర్ లూనార్ ఆర్బిటర్ కూడా ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ తాకిడి ప్రభావం వల్ల చంద్రుడి ఉపరితలంపై దాదాపు 16 నుండి 18 మీటర్ల వెడల్పు గల పెద్ద గొయ్యి ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తోన్నారు. ఢీకొట్టినప్పుడు పైకి లేచే దుమ్ము, రాళ్ల ఆధారంగా చంద్రుడి భౌతిక మార్పులు, గురుత్వాకర్షణ బలం స్వభావాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి వీలు కలుగుతుందని ఆశిస్తోన్నారు. 2019లో చంద్రుడి గర్భంలో ఉన్న మంచు నీటి జాడలను నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు ఉద్దేశపూర్వకంగానే ఒక రాకెట్ ను చంద్రుడి ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ చేయించారు. అది చంద్రుడి చీకటి ప్రదేశంలో పడటం వల్ల వివరాలేవీ చెప్పుకోదగ్గ స్థాయిలో లభించలేదు. ఇప్పుడు దీనికి భిన్నంగా ఓ అన్ కంట్రోల్డ్ స్పేస్ జంక్.. చంద్రుడి వెలుతురు వైపున ఉపరితలాన్ని ఢీ కొట్టబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రాష్ వల్ల ఏర్పడే దుమ్ము తుఫాను, కాంతిని నేరుగా టెలిస్కోప్ ల ద్వారా వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తోన్నారు.భారత విద్యార్థులపై అమెరికా లక్ష డాలర్ల ఫీజు- OPT కి కోలుకోలేని దెబ్బ
మళ్లీ వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ- సేమ్ ప్యాటర్న్
షిరిడీ సాయినాథుడికి నెల్లూరు వాసి ఖరీదైన కానుక- గురుదక్షిణ: దశావతారాలతో కూడిన