భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ అంతరిక్ష ప్రయాణంలో సరికొత్త మైలురాయిని అధిగమించారు. ఇద్దరు రష్యన్ కాస్మోనాట్లతో కలిసి ఆయన ప్రయాణించిన సోయుజ్ అంతరిక్ష నౌక బుధవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) సురక్షితంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చేరుకుంది. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఈ ప్రయాణం ముగియగా, అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన అనిల్ మీనన్ బృందానికి అక్కడ ఉన్న తోటి వ్యోమగాములు ఆత్మీయ హస్తలాఘవాలు, ఆలింగనాలతో ఘన స్వాగతం పలికారు.
మంగళవారం రాత్రి గం. 8:17 నిమిషాలకు బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి వీరి రష్యా అంతరిక్ష నౌక నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు ఎనిమిది నిమిషాల ప్రయాణం తర్వాత కక్ష్యలోకి ప్రవేశించిన ఈ నౌక, మరో మూడు గంటల పాటు అంతరిక్షంలో ప్రయాణించి రాత్రి గం. 11:52 నిమిషాలకు అంతరిక్ష కేంద్రంలోని ప్రిచల్ మాడ్యూల్ను విజయవంతంగా అనుసంధానించింది. ఆ తర్వాత బుధవారం తెల్లవారుజామున గం. 2:00 గంటలకు తలుపులు తెరుచుకోగా, వ్యోమగాములు లోపలికి అడుగుపెట్టారు. అనిల్ మీనన్కు ఇది మొదటి అంతరిక్ష యాత్ర కాగా, ఆయనతో ఉన్న రష్యా వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినాలకు ఇది రెండో యాత్ర.
ఈ ప్రయాణంలో ఒక ముచ్చటైన విశేషం కూడా చోటుచేసుకుంది. ఈ అంతరిక్ష వాహక నౌకపై భారతీయ పాఠశాల విద్యార్థులు గీసిన అందమైన చిత్రాలను ముద్రించారు. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యోమగామి యూరి గగారిన్ చారిత్రక ప్రయాణానికి 65 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని.. భారత్-రష్యాల అంతరిక్ష భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తూ నిర్వహించిన ఒక పోటీలో గెలుపొందిన బాలల చిత్రాలు ఇవి కావడం విశేషం. రాబోయే ఎనిమిది నెలల పాటు అంటే ఏప్రిల్ 2027 వరకు ఈ బృందం అంతరిక్ష కేంద్రంలోనే గడపనుంది. ఈ సుదీర్ఘ కాలంలో అనిల్ మీనన్ పలు వినూత్న శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఇవే కాకుండా కంప్యూటర్లు, వైద్య పరికరాలలో వాడే అధునాతన సెమీకండక్టర్ స్పటికాలను అంతరిక్షంలో ఎలా తయారు చేయవచ్చనే అంశాలపై ఆయన ప్రయోగాలు చేయనున్నారు. అమెరికాలోని మిన్నియాపాలిస్లో జన్మించిన అనిల్ మీనన్కు భారతదేశంతో విడదీయరాని బంధం ఉంది. ఆయన తండ్రి కేపీ. శంకరన్ మీనన్ కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందినవారు కాగా, తల్లి ఎలిజబెత్ ఉక్రెయిన్ వలసదారు. ప్రస్తుతం 49 ఏళ్ల వయసున్న అనిల్ మీనన్ అత్యవసర వైద్య విభాగానికి చెందిన డాక్టర్. గతంలో అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్ కల్నల్గా పనిచేసిన ఆయన, అఫ్గానిస్తాన్ యుద్ధ రంగంలోనూ సేవలు అందించారు. అలాగే ఎవరెస్ట్ పర్వతారోహకులకు వైద్య సేవలు అందించిన అనుభవం కూడా ఆయనకుంది. పోలియో నివారణ కార్యక్రమాల కోసం ఆయన గతంలో ఒక సంవత్సరం పాటు భారతదేశంలోనూ గడిపారు. 2014లో నాసాలో ఫ్లైట్ సర్జన్గా చేరిన ఆయన, ఆ తర్వాత 2018లో ఎలాన్ మాస్క్కు చెందిన ప్రఖ్యాత 'స్పేస్ ఎక్స్' సంస్థలో చేరి మొదటి మానవ అంతరిక్ష యాత్రలకు వైద్య విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం డిసెంబర్ 2021లో నాసా వ్యోమగామిగా ఎంపికై, కఠినమైన శిక్షణ పూర్తి చేసుకున్నారు. మరో విశేషమేమిటంటే, అనిల్ మీనన్ భార్య అన్నా విల్హెల్మ్ కూడా వ్యోమగామే. ఆమె సెప్టెంబర్ 2024లో స్పేస్ ఎక్స్ ప్రైవేట్ మిషన్ 'పోలారిస్ డాన్' ద్వారా ఐదు రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించారు. ప్రస్తుతం అనిల్ మీనన్ సాధించిన ఈ అరుదైన విజయంతో అటు భారతదేశం, ఇటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.రాకెట్పై భారతీయ పాఠశాల పిల్లల చిత్రాలు
Anil Menon: భారతీయ నాసా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపిన రష్యా..!
అంతరిక్షంలో సాగనున్న అద్భుత ప్రయోగాలు
వైద్యుడి నుంచి వ్యోమగామి వరకు సాగిన ప్రస్థానం
శతాబ్దాల నాటి శాపం! కుంగిపోతున్న మహా నగరం