అంతరిక్ష పరిశోధనల్లో మరో అద్భుత ఘట్టానికి తెరలేవబోతోంది. నింగిలో తిరిగే ఉపగ్రహాలకు, అలాగే భూమిపై ఉన్న సైనిక స్థావరాలకు అంతరిక్షం నుంచే నేరుగా విద్యుత్ను సరఫరా చేసే (పవర్ బీమింగ్) సరికొత్త సాంకేతికతపై అమెరికా రక్షణ శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అమెరికా రక్షణ విభాగానికి చెందిన 'డిఫెన్స్ ఇన్నోవేషన్ యూనిట్' (DIU) వాణిజ్య రంగంలోని ప్రైవేట్ కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. సుదీర్ఘ కాలంగా పరిశోధనల దశలోనే ఉన్న ఈ అద్భుత టెక్నాలజీని, ఈ దశాబ్దం ముగిసేనాటికి (2030 నాటికి) పూర్తిస్థాయిలో సైనిక అవసరాల కోసం వినియోగంలోకి తీసుకురావాలనేది పెంటగాన్ ప్రధాన లక్ష్యం.
పనిచేసే విధానం.. ప్రయోజనాలు ఇవే..
ఈ 'పవర్ బీమింగ్' సాంకేతికత ద్వారా విద్యుత్ శక్తిని విద్యుదయస్కాంత కిరణాల (ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్) రూపంలో నేరుగా అవసరమైన రిసీవర్కు బదిలీ చేస్తారు. శాటిలైట్లు తమ స్వంత సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీలపైనే పూర్తిగా ఆధారపడకుండా.. ఎక్కువ కాలం పనిచేయడానికి, భారీ విద్యుత్ అవసరమయ్యే పరికరాలను మోసుకెళ్లడానికి ఇది తోడ్పడుతుంది. విద్యుత్ గ్రిడ్ మౌలిక వసతులు లేని, ఇంధన సరఫరా చేయడం కష్టతరమైన మారుమూల ప్రాంతాల్లో ఉండే సైనిక విభాగాలు, డ్రోన్లు వంటి స్వయంప్రతిపత్తి కలిగిన వ్యవస్థలకు అంతరిక్షం నుంచే నేరుగా కరెంట్ అందించవచ్చు.
ఈ ప్రాజెక్టు కింద ఎంపికైన కంపెనీలు ఒప్పందం కుదిరిన 12 నెలల్లోగా తమ ల్యాబొరేటరీలో దీని పనితీరును నిరూపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అది విజయవంతమైతే, తదుపరి 24 నెలల్లోగా అంతరిక్షంలోనే దీని నమూనాను (ప్రోటోటైప్) ప్రయోగాత్మకంగా పరీక్షించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని పెంటగాన్ భావిస్తోంది. అయితే ఈ పవర్ ప్లాంట్లను ప్రభుత్వమే సొంతంగా కొనుగోలు చేసి నడుపుతుందా లేదా ప్రైవేట్ కంపెనీల నుంచి ఒక సర్వీస్ లాగా కరెంట్ కొంటుందా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మెగా ప్రాజెక్టును మొత్తం నాలుగు విభాగాలుగా విభజించారు. మొదటి రెండు దశల్లో అంతరిక్షం నుంచి మరో అంతరిక్ష నౌకకు, అలాగే అంతరిక్షం నుంచి భూమిపై ఉన్న రిసీవర్లకు విద్యుత్ను బదిలీ చేయడంపై దృష్టి పెట్టారు. మిగిలిన రెండు దశలు ఆ శక్తిని స్వీకరించే రిసీవర్ల సామర్థ్యం, వాటి బరువును తగ్గించడం వంటి అంశాలకు సంబంధించినవి. ఈ ప్రయోగం కోసం అమెరికా కంపెనీలతో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రైవేట్ స్టార్టప్ కంపెనీలు కూడా ఈ టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో, గతంలో కంటే ఇప్పుడు సమర్థవంతమైన సాంకేతికత తక్కువ సమయంలోనే అందుబాటులోకి వస్తుందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నింగి నుంచి నేరుగా కరెంట్ పంపే ఈ ప్రయోగం గనుక సక్సెస్ అయితే రక్షణ రంగంలోనే కాకుండా భవిష్యత్ ప్రపంచ ఇంధన అవసరాల్లో ఇది ఒక పెను మార్పుకు నాంది కానుంది.రెండేళ్లలో చారిత్రాత్మక ప్రయోగం
Wireless Electricity : ఇక కరెంట్ వైర్లు కనిపించవు. మన ఇళ్లకు వైర్ లెస్ పవర్
నాలుగు దశల్లో ప్రాజెక్టు
E10 Motorway: ఈ రోడ్డెక్కితే చాలు మీ వాహనాలు ఆటోమేటిక్ గా ఛార్జ్ అవుతాయి