బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ త్వరలోనే ఫుట్బాల్ గ్రౌండ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ప్రతిష్టాత్మక డ్యూరాండ్ కప్ టోర్నమెంట్లో ముంబై ఫుట్ బాల్ క్లబ్ తరఫున ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆసియాలోనే అత్యంత పురాతనమైన ఈ ఫుట్బాల్ టోర్నీ 135వ ఎడిషన్లో పాల్గొనే ముంబై జట్టు ఆటగాళ్ల జాబితాలో టైగర్ ష్రాఫ్ పేరును నమోదు కావడం క్రీడా, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
టైగర్ ష్రాఫ్.. ముంబై ఎఫ్సీ కోఫౌండర్ కూడా. 2024 జూలైలో పారిశ్రామికవేత్త అలీ అహ్మద్తో కలిసి ఆయన ఈ క్లబ్ను స్థాపించాడు. టోర్నమెంట్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో తోటి ప్లేయర్లతో కలిసి క్రమం తప్పకుండా ప్రాక్టీస్ సెషన్స్ కు హాజరవుతున్నాడు. గ్రూప్ దశలో జరిగే చివరి మ్యాచ్లో ఆయన ఆడే అవకాశం ఉందని క్లబ్ వర్గాలు వెల్లడించాయి. ఈ టోర్నమెంట్ కోసం ముంబై జట్టు ఈ నెల 30న షిల్లాంగ్కు బయలుదేరి వెళ్లనుంది.
ఈ ఏడాది డ్యూరాండ్ కప్లో అరంగేట్రం చేయబోతోన్న ఏడు జట్లలో ముంబై ఎఫ్సీ ఒకటి. మహారాష్ట్ర స్టేట్ క్లబ్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న ఈ జట్టు.. ఐ- లీగ్ 3లో మూడో స్థానంలో నిలిచి ఈ టోర్నమెంట్కు అర్హత సాధించింది. గ్రూప్-ఈ విభాగంలో ఉన్న ముంబై జట్టు ఆగస్ట్ 3వ తేదీన లాంగ్సింగ్ ఎఫ్సీ, 8న షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్సీతో తలపడనుంది. అలాగే 11న నంగ్సే ఎస్ఎస్ అండ్ సీసీతో జరిగే చివరి గ్రూప్ మ్యాచ్లో టైగర్ ష్రాఫ్ జట్టు తరఫున గ్రౌండ్ లో దిగే అవకాశం ఉంది. షిల్లాంగ్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఈ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తోంది. గతంలో స్థానిక ముంబై ప్రీమియర్ లీగ్లో ఆడిన అనుభవం ఉంది టైగర్ ష్రాఫ్ కు. ఈ అనుభవంతోనే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి డ్యూరాండ్ కప్ మ్యాచ్లో ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఓ స్టార్ హీరో ఫుట్బాల్ లీగ్లో ఆడటంపై క్రీడా అభిమానుల్లో ఇప్పటికే హాట్ డిబేట్ మొదలైంది. స్టార్ హీరోగా రాణిస్తోన్న అతను ఫుట్ బాల్ ప్లేయర్ గా ఎలా సత్తా చాటుతాడనే విషయంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. చిన్నప్పటి నుండి ఫుట్బాల్ ప్లేయర్ కావాలనేది తన కల అంటూ టైగర్ ష్రాఫ్ గతంలో పలు వేదికలపై వెల్లడించాడు. పాఠశాల రోజుల్లో ఫుట్బాల్ తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని, దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కోరిక నెరవేరలేదని ఆయన గుర్తు చేసుకున్నారు అప్పట్లో. ఇప్పుడు డ్యూరాండ్ కప్ ద్వారా ఆ కల కొంతవరకు నెరవేరే అవకాశం లభించిందతనికి.దక్షిణ తీరాన కదిలిన సముద్ర గర్భం- రాకాసి అలలు, సునామీ హెచ్చరికలు జారీ
ఎల్లుండి జగన్ ఆ జిల్లా పర్యటన ఫిక్స్- గ్రౌండ్ లెవెల్ లో జోష్.. !!