టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రిత్ బుమ్రా శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్కు దూరం అయ్యాడు. ఎడమ మోకాలి గాయం నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు మ్యాచ్ ల ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పర్యటనకు బుమ్రా అందుబాటులో ఉండట్లేదు. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో అతను ఉన్నప్పటికీ.. ఆ తర్వాత తప్పుకోవాల్సి వచ్చింది.
బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకున్నప్పటికీ.. బుమ్రా మోకాలి భాగంలో ఇంకాస్త అసౌకర్యంగా ఫీలవుతున్నట్లు తేలింది. దీంతో అతన్ని పక్కనపెట్టాలని బీసీసీఐ నిర్ణయించింది. భవిష్యత్తులో భారత్ ఆడబోయే అంతర్జాతీయ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ సెలక్టర్లు, మేనేజ్మెంట్ అతని విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. శ్రీలంక పిచ్లపై బౌలింగ్ భారాన్ని తట్టుకోవడం బుమ్రాకు మరింత కష్టంగా మారవచ్చని భావించి, అతనికి పూర్తి విశ్రాంతి ఇచ్చారు.
ఈ పరిణామాలపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరును ఆయన తప్పు పడుతున్నారు. కీలక ఆటగాళ్ల ఫిట్నెస్, రిహాబిలిటేషన్ ప్రక్రియల నిర్వహణపై అటు బీసీసీఐ, ఇటు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఒకే తాటిపై లేకపోవడం సెలెక్షన్ కమిటీని ఆందోళనకు గురిచేస్తోంది. ఫిట్ నెస్ వ్యవహారంలో తలెత్తిన భిన్నాభిప్రాయాల ప్రభావం ప్లేయర్లపై పడే అవకాశం ఉందని భావిస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం వ్యవహారంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్కు బుమ్రా అందుబాటులో ఉంటాడని సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ మొదట సెలెక్టర్లకు సమాచారం అందించాయి. తీరా చూస్తే బుమ్రా మోకాలి గాయం తీవ్రత తక్కువగా అంచనా వేసినట్లు వెల్లడైంది. గాయం నయం కాకపోవడంతో అతను సిరీస్ మొత్తానికి పూర్తిగా దూరం అయ్యాడు. దీంతో ప్రత్యామ్నాయంగా జమ్మూకాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీకి సెలెక్టర్లు జట్టులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఫిట్ నెస్ విషయంలో నెలకొన్న ఆ పరిణామాలపై చర్చించడానికి సెలెక్షన్ కమిటీ సోమవారం ఓ వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సీఓఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇందులో పాల్గొన్నారు. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్ల ఫిట్ నెస్ గురించి చర్చించారు. లీగ్ల తర్వాత ఆటగాళ్ల గాయాలను ఎలా పర్యవేక్షిస్తున్నారు, సీఓఈ వారికి ఎలాంటి చికిత్సలు అందిస్తోందనే అంశాలపై సెలెక్టర్లు పెదవి విరిచినట్లు తెలుస్తోంది. బుమ్రాతో పాటు ఈ మధ్యకాలంలో హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి వంటి ప్లేయర్లు కీలక సిరీస్ లకు దూరం కావడం, వారి ఫిట్నెస్ రిపోర్టులను సకాలంలో సమగ్రంగా అందజేయడంలో సీఓఈ ఎందుకు విఫలమవుతుందనే అభిప్రాయాన్ని ఈ సందర్భంగా అజిత్ అగార్కర్ వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అర్హతగా భావించే కనీస శారీరక దృఢత్వం లేనప్పటికీ, ఒకరిద్దరు ప్లేయర్లను ఇంగ్లాండ్ పర్యటనకు ఎలా ఫిట్ నెస్ రిపోర్ట్ ఇచ్చారనే విషయాన్నీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.ఏపీని గట్టిగా దెబ్బ కొట్టిన ఎల్ నినో..: చంద్రబాబు యాక్షన్ ప్లాన్
నాగ పంచమి ఎప్పుడు, ఏ రోజున జరుపుకోవాలి