భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్కు అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక బాధ్యత దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ టెస్టు ఫార్మట్ హెడ్ కోచ్ రేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుత కోచ్ బ్రెండన్ మెక్కలమ్ ఈ పదవి నుంచి తప్పుకొన్నారు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ 1-2తో ఓటమి పాలు కావడం.. ఆయనకు ఎసరు పెట్టింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆయనపై వేటు వేసింది. హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించింది.
ఈ నేపథ్యంలో కొత్త కోచ్ అన్వేషణను ఈసీబీ వేగవంతం చేసింది. డైలీ టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. బ్రెండన్ మెక్కలమ్ స్థానంలో కొత్త కోచ్ను నియమించేందుకు షార్ట్ లిస్ట్ చేసిన వారిలో రాహుల్ ద్రావిడ్ పేరు టాప్ లో ఉంది. టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్ను నిలపడంలో ద్రావిడ్ కృషి అపారం. ఆయన వ్యూహాలు ఛాంపియన్ గా నిలిపాయి జట్టును. ఆయన ప్రణాళికలు, ట్రాక్ రికార్డ్స్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో టెస్టు క్రికెట్ను మళ్లీ గాడిలో పెట్టే విషయంలో డ్రావిడ్ సరైన వ్యక్తి అని ఈసీబీ భావిస్తోంది.
టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత మళ్లీ అవే బాధ్యతలను చేపట్టడానికి ద్రావిడ్ పెద్దగా సుముఖంగా లేరనే ప్రచారం ఉంది. ఇంగ్లాండ్ టెస్టు జట్టు కోచ్ బాధ్యతలు చేపడితే స్వదేశంలో ఎక్కువ సమయం గడిపేందుకు వీలుంటుందని ఆయన భావిస్తున్నారు. ఈ ఫార్మట్ ఆయనకు ఎంతో ఇష్టం కూడా. పైగా ప్రస్తుతం దీనావస్థలో ఉన్న ఇంగ్లాండ్ టీమ్ ను మళ్లీ గెలుపు బాట పట్టించడం సవాల్ తో కూడుకున్నది కావడం వల్ల ద్రావిడ్ అంగీకరించవచ్చని డైలీ టెలిగ్రాఫ్ అభిప్రాయపడింది. ద్రావిడ్ తో పాటు మరికొందరు మాజీ దిగ్గజాల పేర్లు కూడా వినిపిస్తోన్నాయి. జింబాబ్వే మాజీ లెజెండర్ ఆండీ ఫ్లవర్ కూడా ఈ రేసులో ఉన్నారు. గతంలో ఆయన నేతృత్వంలో ఇంగ్లాండ్ ఏకంగా మూడు సార్లు యాషెస్ సిరీస్ గెలవడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. వీరితో పాటు గ్లామోర్గాన్ హెడ్ కోచ్, ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ రిచర్డ్ డాసన్ పేరు కూడా పరిశీలనలో ఉంది. వీరితో పాటు శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర, ఇంగ్లాండ్ మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్, పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెసన్, ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. టెస్టు బాధ్యతల నుంచి తప్పుకున్న బ్రెండన్ మెక్కలమ్ వన్డే, టీ20 జట్లకు కోచ్గా కొనసాగనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ముంగిట టెస్టు జట్టుకు దిశానిర్దేశం చేసే సమర్థుడైన కోచ్ కోసం ఈసీబీ అన్వేషణ ఎక్కడ ముగుస్తుందన్నది వేచిచూడాలి.