శ్రీలంకతో త్వరలో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ఎంపిక ప్రక్రియ పూర్తియింది. కొద్దిసేపటి కిందటే 15 మందితో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. వీరిలో చాలామంది సీనియర్లకు చోటు దక్కలేదు. ఒకరిద్దరు న్యూ కమ్మర్లు కూడా ఉన్నారు. ఈ టెస్ట్ సిరీస్ ఆగస్టు 15వ తేదీన ఆరంభం అవుతుంది. శ్రీలంక పర్యటనలో భాగంగా మొదటి టెస్ట్ 15న ప్రారంభమౌతుంది. గాలే దీనికి వేదిక. రెండో టెస్టు అదే నెల 23 నుంచి 27 వరకు కొలంబో జరుగుతుంది.
ఓపెనర్ సాయి సుదర్శన్, పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఎంపికైనప్పటికీ.. వంద శాతం ఫిట్ నెస్ సాధిస్తేనే శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళ్తారు. లేకపోతే వారి స్థానంలో మరో ఇద్దరిని తీసుకుంటుంది బీసీసీఐ. తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం అయ్యే నాటికి తమ ఫిట్ నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. జట్టుకు ఎంపికైన వారిలో సారాన్ష్ జైన్ కు పిలుపు అందింది. అతను ఈ పర్యటన కోసం ఎంపికయ్యాడు. సారాన్ష్ కు ఇదే మొదటి టెస్ట్ మ్యాచ్ కానుంది.
ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కుడి హ్యామ్స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్నాడు. లార్డ్స్ వన్డేకు ముందే అతను గాయపడ్డ విషయం తెలిసిందే. ఫలితంగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టుకు అందుబాటులో ఉండట్లేదు. రెండో టెస్టు నాటికి అతడు కోలుకుంటాడా లేదా అనేది పూర్తి ఫిట్నెస్ పై ఆధారపడి ఉంది. అటు పేసర్ జస్ ప్రీత్ బుమ్రా కూడా మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా బుమ్రా ఎడమ మోకాలికి గాయమైంది. దీంతో అతను జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ.. ఫిట్నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంది. ఈ నెల 30 వరకు విశ్రాంతి తీసుకోవాలని బుమ్రాను సూచించింది బీసీసీఐ. దీని తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మొదటి టెస్ట్ ఆరంభం కావడానికి ఇంకా రెండు వారాలకు పైగా గడువు ఉన్నందున ఫిట్ నెస్ సాధిస్తాడనే నమ్మకంతోనే సెలెక్టర్లు బుమ్రాను శ్రీలంక పర్యటనకు ఎంపిక చేశారు. ఓపెనర్ సాయి సుదర్శన్ పరిస్థితి కూడా ఇంతే. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. అతని గాయం తాలూకు వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరావట్లేదు గానీ కోలుకుంటున్నట్లు సమాచారం. పేస్ ఆల్రౌండర్లు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి కూడా గాయాల కారణంగా ఈ పర్యటనకు పూర్తిగా దూరం అయ్యారు. హర్షిత్ రాణా హ్యామ్స్ట్రింగ్ గాయంతో బాధపడుతుండగా, నితీష్ రెడ్డి క్వాడ్రిస్ప్స్ గాయం నుంచి ఇంకా కోలుకోవట్లేదు. వీరితో పాటు జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో బౌలింగ్ చేస్తూ హ్యామ్స్ట్రింగ్ గాయానికి గురైన ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్, వెన్నునొప్పితో సతమతమవుతున్న హార్దిక్ పాండ్యా కూడా పూర్తి ఫిట్నెస్ సాధించాల్సి ఉంది. వెన్నునొప్పి తిరగబెట్టడంతో టెస్ట్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ ఇంకా కోలుకునే దశలోనే ఉన్నాడు. ఇలా ఒకేసారి నలుగురైదుగురు కీలక బౌలర్లు, ఆల్రౌండర్లు గాయాల జాబితాలో చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడే జట్టులో.. శుభమన్ గిల్ (కేప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కేప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్ దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాన్ష్ జైన్ ఉన్నారు.తడాఖా చూపిన ఏపీ కుర్రాడు: నాడు తండ్రి.. నేడు తనయుడు: కామన్వెల్త్ లో రజతం
రేపే గురు పూర్ణిమ: 56 ఏళ్ల తర్వాత- డోంట్ మిస్: ఈ పనులు చేయండి చాలు