టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రిత్ బుమ్రా శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్కు దూరం అయ్యాడు. ఎడమ మోకాలి గాయం నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు మ్యాచ్ ల ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పర్యటనకు బుమ్రా అందుబాటులో ఉండట్లేదు. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో అతన్ని తీసుకుంది బీసీసీఐ.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకున్నప్పటికీ.. బుమ్రా మోకాలి భాగంలో ఇంకాస్త అసౌకర్యంగా ఫీలవుతున్నట్లు తేలింది. దీంతో అతన్ని పక్కనపెట్టాలని బీసీసీఐ నిర్ణయించింది. భవిష్యత్తులో భారత్ ఆడబోయే అంతర్జాతీయ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ సెలక్టర్లు, మేనేజ్మెంట్ అతని విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. శ్రీలంక పిచ్లపై బౌలింగ్ భారాన్ని తట్టుకోవడం బుమ్రాకు మరింత కష్టంగా మారవచ్చని భావించి, అతనికి పూర్తి విశ్రాంతి ఇచ్చారు.
బుమ్రా సిరీస్ నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ స్పీడ్స్టర్ ఆకిబ్ నబీ దర్ పేరు సెలక్టర్ల పరిశీలనలో ఉంది. దేశవాళీ రంజీ ట్రోఫీలో ఆకిబ్ నబీ నిలకడగా రాణిస్తోన్నాడు. అతనితో పాటు విదర్భకు చెందిన పేసర్ యష్ ఠాకూర్ పేరును కూడా సెలెక్టర్లు పరిశీలిస్తోన్నారు. బుమ్రా ఒక్కడే కాకుండా, మరికొందరు కీలక ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్యలతోనూ సతమతమవుతున్నారు. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం కండరాల నొప్పులతో బాధపడుతున్నారు. ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్లో బుమ్రా గాయపడ్డాడు. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంటోన్నాడు. శ్రీలంక సిరీస్ తో మళ్లీ జట్టులోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ పూర్తి స్థాయి మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేకపోయాడు. శ్రీలంక పిచ్లు సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. టెస్ట్ ఫార్మాట్లో పేసర్ల పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల నైపుణ్యం కలిగిన ఆకిబ్ నబీ లేదా యశ్ ఠాకూర్ లలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆకిబ్ నబీ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపొచ్చు. బుమ్రా లేకపోవడం వల్ల అనుభవజ్ఞుడైన మహ్మద్ సిరాజ్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ను లీడ్ చేయాల్సి ఉంటుంది.