పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రదాడి: 20 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కారు బాంబు పేలుళ్లు సహా గన్మెన్ జరిపిన కాల్పుల్లో 20 మందికి పైగా మృతి చెందారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు.
వివరాల్లోకి వెళితే, పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో రాజధాని ఔగాడుగులోని ఫైవ్స్టార్ హోటల్ స్పెన్డిడ్ వద్ద ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. హోటల్లోకి మారణాయుధాలతో చొరబడిన ఉగ్రవాదులు పలువురిని బందీలుగా చేసుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది, సైన్యం అక్కడికి చేరుకుంటుండగానే హోటల్ బయట రెండు కారు బాంబులను పేల్చారు. ఈ ఘటనలో ఉగ్రవాదుల దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
సైన్యం, ఉగ్రవాదుల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. హోటల్లోని ఉగ్రవాదుల చెరలో ఎంతమంది బందీలుగా ఉన్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ దాడిగి పాల్పడింది స్థానిక అల్ ఖైదా గ్రూపు అనుబంధ సంస్థ ఏక్యూఐఎమ్ ప్రకటించింది.
15 మందికి బుల్లెట్ గాయాలు ఉన్నాయని, దాడినుంచి తప్పించుకునే యత్నంలో మరికొంతమందికి గాయాలయ్యాయని రాజధానిలోని యల్గాడో ఆస్పత్రి వైద్యులు వివరించారు. యూఎన్ అధికారులు, పశ్చిమ దేశాల వాసులు ఎక్కువగా స్పెన్డిడ్ హోటల్లో బస చేస్తుంటారు.
వారినే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చునని స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. సరిహద్దు దేశం మాలిలోని రాడిసన్ హోటల్లోనూ గతేడాది ఇదేవిధంగా ఉగ్రవాదులు చేసిన దాడిలో 20 మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే.