స్వరం మార్చిన రాందేవ్ : ప్రధాని ఎవరో చెప్పలేం..
ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎప్పుడూ ప్రధాని మోదీకి అనుకూలంగా మాట్లాడే రాందేవ్ బాబా స్వరంలో మార్పు కనిపిస్తోంది. ఆయన తన వైఖరి మార్చుకున్నారా..లేక..మోదీ తిరిగి ప్రధాని కారని భావిస్తున్నారా అనే చర్చ మొదలైంది. మరి..రాందేవ్ కాంగ్రెస్ కు మద్దతిస్తారా..
కాబోయే ప్రధాని ఎవరనే విషయంపై ప్రముఖ యోగా గురు బాబారాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయా లు చాలా క్లిష్టతరంగా మారుతున్నాయని... భవిష్యత్ లో దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి ఎవరనే విషయం చెప్పలే మని రాందేవ్ మధురైలో వ్యాఖ్యానించారు. రామేశ్వరంలో నిర్వహించిన జాతీయ భారత్ స్వాభిమాన్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను ఏ పార్టీకి గాని ఏ వ్యక్తికి గాని మద్ధతు ఇవ్వనని రాందేవ్ స్పష్టం చేశారు. తాను రాజకీయాలపై దృష్టి సారించడం లేదన్నారు. భారతదేశం హిందూ దేశం చేయాలని లేదని, ఆధ్యాత్మకంగా మన దేశంలో యోగా, వైదిక్ ధర్మాలను ప్రచారం చేయడమే తన లక్ష్యమని రాందేవ్ బాబా వివరించారు.
సాధారణంగా రాందేవ్ బాబా ప్రధాని మోదీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి రాందేవ్ ఇప్పుడు ప్రధాని పదవి పై వ్యాఖ్యలు చేయటం కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాలు..బిజెపి కి వ్యతిరేకంగా వస్తున్న విమర్శలు రాందేవ్ ను ప్రభావితం చేసాయా అనే అనుమానం కలుగుతోంది. ఇదే సమయంలో తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వని రాందేవ్ బాబా తేల్చి చెప్పారు.