అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయాలన్న ఏపీ సర్కారు నిర్ణయంపై మీ కామెంట్ ఏంటి?
అమరావతి : ఏపీ సీఎం జగన్ ప్రకటించిన అమ్మఒడి పథకం ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందాయి. ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పథకానికి సర్కారు మెలికపెట్టింది. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, గవర్నమెంట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తింప చేస్తామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గర రాజేందర్ స్పష్టం చేశారు. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు పథకం వర్తింపజేసే అంశంపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ చీఫ్ జగన్ ప్రతి విద్యార్థిని ప్రభుత్వమే చదివిస్తుందని ప్రకటించారు. పిల్లల్ని బడికి పంపిస్తే ప్రభుత్వమే ప్రతి విద్యార్థి కుటుంబానికి రూ.15వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. అమ్మ ఒడి పథకాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని ప్రకటించడం విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు అటు ప్రైవేట్ స్కూల్స్ కూడా సంతోషం వ్యక్తంచేశాయి. వేల రూపాయల ఫీజులు కట్టలేక పేరెంట్స్, సరైన సమయంలో ఫీజులు రాక స్కూల్ యాజమాన్యాలు సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రకటన వారికి కొండంత ఊరటనిచ్చింది. అయితే అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ అమ్మఒడి పథకం కేవలంప్రభుత్వ స్కూళ్లలో అదీ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకే వర్తిస్తుందని ప్రకటించారు.
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేక చాలా మంది వెనకబడిన వర్గాలు అనేక కష్టనష్టాలకు ఓర్చి తమ పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థల్లోనే చదివిస్తున్నారు. పిల్లల భవిష్యత్ కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటీ వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే 15వేల కోసం అకస్మాత్తుగా తమ పిల్లల స్కూళ్లను మార్చే పరిస్థితి ఉండదు. దీంతో ప్రజలు ఆశించిన విధంగా అమ్మ ఒడి పథకం ఏ మేరకు ఫలితం చూపిస్తుందన్నది ప్రస్తుతానికి జవాబులేని ప్రశ్నగా మారింది. అమ్మఒడి పథకాన్ని కేవలం సర్కారీ బడులకే పరిమితం చేయాలన్న జగన్ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.