బీజేపీ సొంతంగా 271 స్థానాలు గెలిస్తే సంతోషమేనన్న రాం మాధవ్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
సార్వత్రిక ఎన్నికలు మరో రెండు వారాల్లో ముగియనున్నాయి. ఐదు దశల్లో ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో పోలింగ్ పూర్తికాగా.. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈసారి ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతల కామెంట్లను పరిశీలిస్తే విజయంపై వారంత ధీమాగా లేనట్లే తెలుస్తోంది. పొత్తు విషయంలో వైసీపీ చీఫ్ జగన్తో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రహస్య భేటీ ఊహాగానాలు ఒకవైపు.. తాజాగా బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వ్యాఖ్యలు మరోవైపు ఈ వాదనలకు బలం చేకూర్చుతున్నాయి.
బ్లూమ్బర్గ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాం మాధవ్ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 271 సీట్లు సాధిస్తే సంతోషమని అన్నారు. ఎన్డీఏ మిత్ర పక్షాలతో కలుపుకుంటే మాత్రం తమకు మంచి మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ మరింత కృషి చేసి ఉంటే పరిస్థితి సౌకర్యంగా ఉండేదని రాం మాధవ్ అభిప్రాయపడ్డారు.
బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ తమ పార్టీకి సొంతంగా రాదంటూ చెప్పడం రాజకీయ చర్చకు దారితీసింది. దీంతో తాజాగా ఆయన మాట మార్చారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, కేంద్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. ఈసారి బీజేపీ 271 సీట్లు సాధిస్తే సంతోషమన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.