అమ్మఒడి పథకానికి తెల్లరేషన్ కార్డు ముడిపెట్టిన జగన్ సర్కార్...మీ అభిప్రాయం ఏమిటి..?
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి మానసపుత్రిక పథకం అమ్మఒడిపై ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. ప్రతిపక్షనేతగా ప్రస్తుత సీఎం వైయస్ జగన్ పాదయాత్ర చేసిన సమయంలో తమ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లీకీ రూ.15వేలు తమ ఖాతాల్లోకి జమచేస్తామని హామీ ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి పథకంకు శ్రీకారం చుడుతామని ప్రకటించారు. అయితే అది అందరికీ వర్తిస్తుందా లేక ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపించే తల్లిదండ్రులకే వర్తిస్తుందా అనే మీమాంస నెలకొంది. ఒకానొక సమయంలో ఆర్థికశాఖ మంత్రి ప్రభుత్వ పాఠశాలలకు పిల్లను పంపించే తల్లికి మాత్రమే అమ్మఒడి పథకం వర్తిస్తుందంటూ వ్యాఖ్యలు చేయడంతో పథకంపై విమర్శలు వచ్చాయి. అయితే ప్రైవేటు పాఠశాలలకు, ఇంటర్ కాలేజీలకు పంపించే తల్లులకు కూడా అమ్మఒడి పథకం వర్తిస్తుందంటూ ప్రబుత్వం క్లారిటీ ఇచ్చింది.
తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చిన మరో ప్రకటన అమ్మఒడి పథకంపై మళ్లీ నీలినీడలు అలుముకునేలా చేసింది. కేవలం తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందంటూ ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. తమ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ అమ్మఒడి పథకం ఇస్తానని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు కొత్తగా షరతులు విధించడంపై ప్రతిపక్షం విమర్శిస్తోంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీఎం జగన్ తెల్లరేషన్ కార్డు షరతు విధించారా..? హామీ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్క తల్లికి ఇది అమలు చేయాలని మీరు భావిస్తున్నారా..? అమ్మఒడి పథకంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో పోస్టు చేయండి.