Debate:తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ పోటీచేయాలా లేక జనసేన బరిలోకి దిగాలా..?
తిరుపతి లోక్సభ స్థానానికి నిర్వహించబోయే ఉప ఎన్నిక.. భారతీయ జనతా పార్టీ-జనసేన కూటమికి అగ్నిపరీక్షగా మారబోతోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు మూణ్నాళ్ల ముచ్చటగానే కనిపిస్తోంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక బరిలో ఎవరు పోటీ చేయాలనే విషయంపై జనసేన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా పొత్తు పార్టీ బీజేపీకి అవకాశం ఇచ్చామని, ఈ సారి ఆ ఛాన్స్.. తమకు ఇవ్వాల్సి ఉంటుందనే డిమాండ్..జనసేనలో బలంగా వినిపిస్తోంది.
దర్శనం చేసుకుని ఆలయం నుంచి వస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
తిరుపతి లోక్సభ స్థానాన్ని తాము వదులుకోవాల్సిన పరిస్థితే ఏర్పడితే.. కొన్ని డిమాండ్లను బీజేపీ నెరవేర్చాల్సి ఉంటుందని, వాటిపై హామీ ఇవ్వాల్సి ఉంటుందని రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పేరును ప్రకటించాల్సి ఉంటుందని డిమాండ్ చేశారు.
దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్ర నాయకులు ఓ విస్పష్టమైన ప్రకటన చేయాలని అన్నారు. ఇక జనసేన చేసిన డిమాండ్ పై మీ అభిప్రాయం ఏంటి..? తిరుపతిలో జనసేన అభ్యర్థి బరిలో దిగాలా లేక బీజేపీ అభ్యర్థి బరిలో దిగాలా..? ఎవరు పోటీచేస్తే బలమైన వైసీపీని ఎదుర్కోగలరని మీరు భావిస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలపగలరు.