ఐదేళ్లుగా రాష్ట్ర అవతరణ దినోత్సవానికి నోచుకోని ఏపీకి జగన్ పరిష్కారం చూపుతారా? మీ కామెంట్ ఏంటి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఐదేళ్లు పూర్తైంది. 2014 జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మనుగడలోకి వచ్చాయి. ఆ రోజున తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటుంటే ఏపీలో గత సర్కారు మాత్రం నవనిర్మాణ దీక్షల పేరుతో వారం పాటు కార్యక్రమాలు నిర్వహించింది. ఫలితంగా ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి కూడా అవతరణ దినోత్సవం జరుపుకోలేదు.
పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం ఫలితంగా 1953 అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 1956లో ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణను విలీనం చేయడంతో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పటి నుంచి ఏటా నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు జరుపుకునే వారు. కానీ రాష్ట్ర విభజన అనంతరం జూన్ 2న తెలంగాణ అధికారికంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటే.. ఆంధ్రప్రదేశ్ పాలకులు మాత్రం ఈ విషయాన్నే పట్టించుకోలేదు. ఐదున్నర కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రానికి అవతరణ దినోత్సవం లేకపోవడంపై చాలాకాలంగా చర్చ సాగుతోంది.
గతంలో నవ నిర్మాణ దీక్షల పేరుతో వారం రోజుల పాటు నిరసనలు తెలిపిన చంద్రబాబు సర్కారు ఏపీ ఆత్మగౌరవం, రాష్ట్ర అవతరణ గురించి పట్టించుకోలేదు. మరి ఇప్పుడు పాలకులు మారారు. ఏపీ రెండో ముఖ్యమంత్రిగా జగన్ పాలనా పగ్గాలు చేపట్టారు. మరి ఏపీ ప్రజల ఆకాంక్షల మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ తేదీని ఖరారు చేస్తారా? గతంలో కేంద్రం చెప్పినట్లు అక్టోబర్ 1న ఆవిర్భావ వేడుకలు జరుపుతారా? లేక మరేదైనా తేదీ నిర్ణయిస్తారా? అసలు ఈ విషయంలో జగన్ నిర్ణయం తీసుకుంటారా లేదా? అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై మీ అభిప్రాయాలను, సలహాలు, సూచనలను కామెంట్ రూపంలో చెప్పండి.