జగన్ హయాంలోనైనా అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు వస్తాయా? మీ కామెంట్ ఏంటి?
అమరావతి : నవ్యాంధ్రలో కొత్త శకం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో అసెంబ్లీ తొలిసారి కొలువుదీరింది. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా వారి భవితకు భరోసానిస్తూ బుధవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గత 30ఏళ్ల చరిత్రలో అత్యధికంగా కొత్త ఎమ్మెల్యేలు చట్టసభలో అడుగుపెట్టారు. అందుకో కొత్తగా కొలువుదీరిన సభపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు.
ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిన గత శాసనసభ మరకలను చెరిపేస్తూ ఐదేళ్ల కష్టాల నుంచి సాంత్వన కోరుతూ కొత్త ప్రభుత్వం వైపు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ప్రజాస్వామ్య విలువలకు పట్టంకడుతూ సుపరిపాలనకు మార్గం సుగమం చేసేలా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. చట్టసభలపై ప్రజలకు విశ్వాసం పెరిగేలా శాసనసభను నడపాలని నిర్ణయించారు.
2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన జగన్ గత అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా సమర్థవంతంగా పనిచేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగించారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా ఎండగట్టిన ఆయన.. చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ శాసన సభ సమావేశాలను పూర్తిగా బహిష్కరించారు. ముఖ్యమంత్రి హోదాలో మళ్లీ శాసన సభలో అడుగుపెట్టారు. జగన్పై అపారమైన నమ్మకంతో జనం ఆయనకు అఖండ విజయాన్ని కట్టబెట్టారు. మరి సీఎంగా జగన్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఈ సారైనా శాసనసభ వేదికగా ప్రజా సమస్యలు చర్చకు వస్తాయని భావిస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.