1381 కిలోల బంగారం విషయంలో టీటీడీ వైఖరిపై మీ కామెంట్ చెప్పండి
టీటీడీ బంగారం తరలింపు వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో 1381 కిలోల బంగారాన్ని అవసరమైన డాక్యుమెంట్లు లేకుండానే తరలించడం అనుమానాలు రేకెత్తించింది. ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం, పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగారం తరలింపు ప్రక్రియలో లోపాలు నిజమేనని ఏపీ సీఎస్ అంగీకరించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి 1381 కిలోల బంగారం పట్టుబడిన నాటి నుంచి టీటీడీ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ బంగారం మాదే కానీ మాది కాదంటూ టీటీడీ ఈవో అనిల్ సింఘాలు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బంగారం తరలింపు బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంకుదేనని, దాన్ని తమ వద్ద జమ చేసిన తర్వాతే ఆది టీటీడీది అవుతుందన్నది ఆయన మాట.
ఇదిలా ఉంటే టీటీడీ బంగారం తరలింపులో పీఎన్బీ బ్యాంకు అధికారుల వైఖరి సైతం అనుమానాలకు తావిచ్చేలా ఉంది. భారీ మొత్తం బంగారాన్ని ప్రైవేట్ వాహనంలో ఎందుకు తరలించారన్నది జవాబులేని ప్రశ్నగానే మిగిలింది. ఇక గోల్డ్కు సంబంధించిన డాక్యుమెంట్లు విషయంలో అటు టీటీడీ గానీ, ఇటు పంజాబ్ నేషనల్ బ్యాంకు గానీ వ్యవహరించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న శ్రీవారి బంగారం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖరిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.