బాబు ఇంటిపై సీఎం జగన్ జాలి చూపినా, కృష్ణమ్మ కరుణించ లేదనే వ్యాఖ్యలపై మీ కామెంట్?
అమరావతి: ఎగువన ఉన్న మహారాష్ట్ర కర్ణాటక సహా మనరాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల ఫలితంగా కృష్ణానది వరద నీటితో పోటెత్తుతోంది. సుమారు పదేళ్ల తరువాత కృష్ణానదికి భారీ వరదలు సంభవించాయి. కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల గేట్లను ఎత్తేశారు. పులిచింతల నుంచి సుమారు 8,52,891 క్యూసెక్కుల మేర వరద నీటిని దిగువకు వదిలి వేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి చెందిన 70 గేట్లను కూడా ఎత్తేయడంతో లక్షలాది క్యూసెక్కుల మేర కృష్ణా జలాలు బంగాళాఖాతం వైపు ఉరకలు వేస్తున్నాయి. సముద్రంలో కలుస్తున్నాయి.
పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ మధ్యలో గుంటూరు జిల్లాలోని ఉండవల్లి సమీపంలో కరకట్ట మార్గంలో కృష్ణానది ఒడ్డున నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వరద పోటుకు గురైంది. వరద నీళ్లు చంద్రబాబు నివాసాన్ని చుట్టుముట్టాయి. వరదనీరు ఆయన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటానికి వేలాది ఇసుక బస్తాలు, స్టోన్ క్రష్ మూటెలను అడ్డుగా పెట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ- ఆయన కొత్తగా నిర్మించుకున్న భవనం మునకేసింది.
ఈ పరిస్థితి తలెత్తుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం, వరద ముప్పు తప్పదని పర్యావరణ వేత్తలు ముందే హెచ్చరించినప్పటికీ.. చంద్రబాబు వినిపించుకోలేదు. ఫలితమే ఇది. చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయించడంలో వైఎస్ జగన్ జాలి చూపినప్పటికీ.. కృష్ణమ్మ కరుణించలేదని, దగ్గరుండి మరీ చంద్రబాబుతో ఖాళీ చేయించిందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై మీ కామెంట్ వెల్లడించండి.