రాజధానిగా అమరావతి పనికిరాదన్న బొత్స: కడుపు రగిలిపోతోందన్న బాబు వ్యాఖ్యలపై మీ కామెంట్?
అమరావతి: కృష్ణానదికి తాజాగా సంభవించిన వరదలు అటు కృష్ణా, ఇటు గుంటూరు జిల్లాలను ముంచేశాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న కరకట్ట నివాసం కూడా వరద ముంపునకు గురైంది. రాజధాని ప్రాంత అభివృద్ది అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలోని అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మోకాలి లోతు నీళ్లు నిలిచాయి. భవిష్యత్తులో ఏర్పడే పెను ముప్పును కృష్ణానది వరదలు ముందే హెచ్చరించాయని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు చెబుతున్నారు.
ఇప్పుడున్న ప్రాంతంలోనే రాజధానిని నిర్మించాల్సి వస్తే..వరదల ముప్పు తప్పదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాజధానిని తరలించే అవకాశం ఉందనీ అన్నారు. దీనిమీద త్వరలోనే ఓ కీలక ప్రకటన వస్తుందని చెప్పుకొచ్చారు. మరోవంక- మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి భిన్నమైన విమర్శలు చేశారు. అమరావతిని ఉద్దేశపూరకంగా ముంచేశారని చెబుతున్నారు.
రాజధానిని తరలించాలనే ఉద్దేశంతో కృత్రిమ వరదలను సృష్టించారని ఆయన విమర్శిస్తున్నారు. ఈ వరద ముంపును చూస్తోంటే తన కడుపు రగలిపోతోందని ధ్వజమెత్తారు. బొత్స సత్యనారాయణ, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిలించాయి. రాజధానిగా అమరావతి పనికిరాదన్న బొత్స, కృత్రిమ వరదలు సృష్టించారన్న చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలపై మీ కామెంట్స్ వెల్లడించండి.