ఓట్ల కోసం పార్టీలు పదివేల కోట్ల అవినీతి సొమ్ము ఖర్చు పెట్టాయన్న జేసీ వ్యాఖ్యలపై మీ కామెంట్ చెప్పండి
ఓట్ల కోసం కోట్లు ఖర్చు పెట్టామన్న జేసీ దివాకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఈసారి ఎన్నికల్లో తన నియోజకవర్గంలో రూ.50కోట్లు ఖర్చుపెట్టానన్న జేసీ ఓటు కోసం రూ.5వేలు డిమాండ్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు కనీసం రూ.25కోట్లు ఖర్చుపెట్టారని అన్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిపి ఓట్ల కోసం రూ.10వేల కోట్లు ఖర్చుచేశాయని చెప్పారు. తన కుమారుడు ఎంపీగా పోటీ చేసిన అనంతపురం నియోజకవర్గంలో ఒక్కో ఓటుకు రూ.2వేలు ఇచ్చినట్లు జేసీ అంగీకరించారు.
ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగిపోయిందని జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పంచిపెట్టిందంతా అవినీతి సొమ్మేనని కుండబద్ధలు కొట్టారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన 120 సంక్షేమ పథకాలను ఎవరూ పట్టించుకోవడంలేదని, అందుకే జనం డబ్బు డిమాండ్ చేస్తున్నారని స్పష్టం చేశారు. ఏపీలో మరోసారి టీడీపీ విజయ ఢంకా మోగిస్తుందని, పసుపు - కుంకుమ, పెన్షన్ పథకాలే తమని కాపాడతాయన్నారు.
ఓట్ల కోసం రాజకీయ పార్టీలు కోట్లు కుమ్మరిస్తున్నాయని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఓ పార్టీ నేత ఆ విషయాన్ని బాహాటంగా ఒప్పుకోవడం హాట్ టాపిక్గా మారింది. ఓట్ల కోసం కోట్ల రూపాయల అవినీతి సొమ్ము ఖర్చుచేశామన్న జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.