ఎన్డీయేతర పార్టీలను ఏకం చేస్తానంటున్న బాబు.. జారిపోతున్న బెహన్ జీ, స్టాలిన్!? మీ కామెంట్ ఏంటి?
Recommended Video
బీజేపీ మరోసారి అధికారం చేపట్టకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ను అస్సలు పట్టించుకోనవసరం లేదంటున్న ఆయన.. బీజేపీయేతర పార్టీలను ఏకతాటి పైకి తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కాంగ్రెస్తో పాటు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతే మోడీ గద్దెనెక్కకుండా అడ్డుకోగలమన్నది బాబు అంచనా. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత కాంగ్రెస్తో పాటు వివిధ నేతల ముందు సరికొత్త వ్యూహాన్ని ఉంచారు.
కేంద్రంలో అధికారం చేపట్టేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం కావాలన్నది చంద్రబాబు ప్లాన్. ఇందులో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలని ఆయన అంటున్నారు. ఫలితాల అనంతరం ఎక్కువ స్థానాలు పొందిన పార్టీ నేతకు ప్రధానిగా అవకాశమివ్వాలని, దక్షిణ, పశ్చిమ, తూర్పు ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురిని ఉప ప్రధానిగా నియమించాలన్నది ఆయన ప్రతిపాదన. ఇదే విషయాన్ని చంద్రబాబు సోనియా, రాహుల్ వద్ద ప్రస్తావించగా.. వారు ఇది సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఫలితాలు వెలువడిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు సమాచారం.
బాబు వ్యూహం ఇలా ఉంటే ఎగ్జిట్ పోల్ అనంతరం పరిస్థితులు చకచకా మారిపోతున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు డీఎంకే చీఫ్ స్టాలిన్ సర్వే అంచనాల అనంతరం మాట మార్చారు. ఆదివారం యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాతో భేటీ కావాల్సి ఉండగా.. బెహన్ జీ ఢిల్లీ టూర్ రద్దు చేసుకున్నారు. మరోవైపు కేంద్రంలో ఏ కూటమిలో చేరేది ఫలితాల తర్వాతే నిర్ణయిస్తామని స్టాలిన్ తేల్చిచెప్పారు. అటు తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ సైతం బాబు ప్రతిపాదనపై అంతగా స్పందించలేదని తెలుస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మోడీకి వ్యతిరేకంగా బీజేపీయేతర పక్షాలను ఏకం చేయాలన్న బాబు ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాయన్న అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.