ఆర్జీవీని విజయవాడలో అడుగుపెట్టకుండా అడ్డుకోవడంపై మీ కామెంట్ ఏంటి?
విజయవాడలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ అక్రమ నిర్బంధ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి 29న ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగియడంతో హైకోర్టు, ఎన్నికల కమిషన్ అనుమతితో మే1న ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ చేయాలనుకున్నారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఆదివారం ప్రెస్మీట్ నిర్వహించేందుకు గన్నవరం చేరుకున్న వర్మకు చేదు అనుభవం ఎదురైంది.
నోవాటెల్తో పాటు హోటల్ ఐలాపురం ప్రెస్ మీట్ నిర్వహించేందుకు నిరాకరించాయి. దీంతో వర్మ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నడి రోడ్డుపై ప్రెస్మీట్ నిర్వహిస్తానని ప్రకటించారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి కారులో బయలు దేరిన వర్మను రామవరప్పాడు రింగ్ రోడ్డు సమీపంలో విజయవాడ పోలీసులు అడ్డుకున్నారు.
ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రెస్మీట్ పెట్టేందుకు వీల్లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశముందన్న సాకుతో వర్మను బలవంతంగా కారులో ఎక్కించుకుని గన్నవరం విమానాశ్రయానికి తరలించారు. ఆయన ఎవరితో మాట్లాడకుండా కట్టుదిట్టం చేశారు. దాదాపు ఆరు గంటల పాటు విమానాశ్రయంలోనే నిర్భంధించిన అనంతరం రాత్రి 7.20గం. ఇండిగో ఫ్లైట్లో రామ్ గోపాల్ వర్మను హైదరాబాద్కు పంపించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ కోసం వెళ్లిన రామ్ గోపాల్ వర్మను విజయవాడలో అడుగుపెట్టకుండా అడ్డుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.