ఇండియన్ క్రికెటర్లు ఆట కోసం కాదు.. హనీమూన్కి వెళ్లారన్న రాఖీ సావంగ్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటీ..?
ముంబై: ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ టోర్నమెంట్ సెమీ ఫైనల్లో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ చేతిలో దారుణంగా పరాజయం పాలైంది. ఈ టోర్నమెంట్ మొత్తానికీ వరుసగా సెంచరీలు, అర్ధసెంచరీలు చేస్తూ, రికార్డులను బద్దలు కొడుతూ వచ్చిన ఓపెనర్ రోహిత్ శర్మ, కేప్టెన్ విరాట్ కోహ్లీ.. కీలకమైన సెమీస్లో చతికిల పడ్డారు. ఘోరంగా విఫలం అయ్యారు. తలా ఒక పరుగు మాత్రమే చేసి, పెవిలియన్ దారి పట్టారు.
టీమిండియా బ్యాటింగ్ లైనప్లో మూలస్తంభాలుగా చెప్పుకొనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం కావడం వల్ల పేకమేడలా కుప్పకూలిపోయింది టీమ్. చివరలో మహేంద్రసింగ్ ధోనీ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆదుకోకపోయి ఉంటే మరింత అవమానకర ఓటమిని చవి చూసి ఉండేది. ఈ మ్యాచ్ అనంతరం భారత క్రికెటర్ల ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అన్ని మ్యాచ్లనూ గెలుస్తూ రావడం వల్ల కళ్లు నెత్తికెక్కాయంటూ విమర్శించారు చాలామంది.
బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. టీమిండియా క్రికెటర్లపై నిప్పులు చెరగడంలో ఓ అడుగు ముందే ఉన్నారామె. తమ భార్యలను వెంటేసుకుని ప్రపంచకప్ టోర్నమెంట్ను కోహ్లి, రోహిత్ శర్మ హనీమూన్ ట్రిప్గా మార్చుకున్నారని ఆరోపించారు. వరుస విజయాలను సాధించడం వల్ల వారిలో అహంభావం పేరుకుపోయిందని, దీనివల్లే ఓటమి చవి చూడాల్సి వచ్చిందని ధ్వజమెత్తారు. రాఖీ సావంత్ చేసిన అభిప్రాయాలను మీరు సమర్థిస్తారా? లేక తోసిపుచ్చుతారా?