సచివాలయం నిర్మాణం పేరుతో కేసీఆర్ ప్రజాధనం వృథా చేస్తున్నారన్న రేవంత్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
హైదరాబాద్: కొత్త సచివాలయం నిర్మించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నారు. తక్కువలో తక్కువ మరో 50ఏళ్లు మన్నే భవనాలను కూల్చి వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అలాంటి బిల్డింగులను కూల్చి కొత్తవి నిర్మించాల్సిన అవసరమేముందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, కేసీఆర్ను ప్రశ్నించారు. సచివాలయ నిర్మాణంతో కేసీఆర్ ప్రజాధనం వృథా చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదని, దానిపై న్యాయపోరాటం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
కొడుకును ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ వాస్తు కారణాలు చూపి సెక్రటేరియట్ బిల్డింగులను కూల్చేస్తామంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో ముఖ్యమంత్రుల కొడుకులు సీఎంలు కాకపోవడంతో సచివాలయానికి వాస్తుదోషం ఉందని కేసీఆర్ భావిస్తున్నారని, ఆ కారణంగానే వాటిని కూలగొట్టాలని నిర్ణయించారని విమర్శించారు. వాస్తుపై నమ్మకం వేరు, వాస్తు పిచ్చి వేరన్న రేవంత్ రెడ్డి.. వాస్తు పిచ్చితో కేసీఆర్ ప్రజలను పట్టించుకోవడంలేదని అన్నారు. తమ విలాసాల కోసం ప్రజాబీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తప్పుబట్టారు.
ఉమ్మడి ఏపీలో 10కోట్ల మంది ప్రజల అవసరాలకు అనుగుణంగా కోట్లు వెచ్చించి నిర్మించిన సచివాలయ భవనాలల్లో చాలా బ్లాకులు 2004 తర్వాత కట్టినవే. వందేళ్లు మన్నేలా అన్ని ప్రమాణాలు పాటిస్తూ వాటిని నిర్మించారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి విలాసాలు, ప్రతిష్ఠ కోసం ఖజానా నుంచి పెద్ద మొత్తంలో నిధులతో కొత్త బిల్డింగులు నిర్మించాలనుకోవడం సరికాదని రేవంత్ రెడ్డి హితవు పలికారు. ఒకవేళ ప్రస్తుత సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు నడపవద్దనుకుంటే ఇతర అవసరాల కోసం వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. వాస్తు పిచ్చితో కొడుకు కేటీఆర్ను సీఎం చేసేందుకు సెక్రటేరియట్ బిల్డింగ్ను కూల్చి ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.